కేరళ కమలంలోకి పీటీ ఉష..కమ్యూనిస్టులు కంచుకోటపై కాషాయం కన్ను

కేరళ కమలంలోకి పీటీ ఉష..కమ్యూనిస్టులు కంచుకోటపై కాషాయం కన్ను

PT Usha to join BJP? :  పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశమంతా బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరాలనే కంకణం కట్టుకున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఓ పక్క పశ్చిమ బెంగాల్ లో తన జెండా ఎగురవేయాలని ఎత్తులు..మరోపక్క కేరళలో కూడా తన ప్రభావాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన కేరళపై కాషాయనేతల కన్ను పడింది. దీంతో ప్రముఖులకు గాలం వేసి కేరళలో అధికారంలోకి రావటానికి యత్నాలు సాగిస్తోంది. దీంట్లో భాగంగానే పరుగుల రాణి పీటీ ఉషను రంగంలోకి దింపేందుకు ఎత్తులు వేస్తోంది.

కేరళపై బీజేపీ గురి పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోవైపు కేరళ నుంచే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కమ్యూనిస్టులకు బలమైన కోటగా ఉన్న కేరళపై కాషాయ నేతలు కన్నేశారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. దీంతో కేరళలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన శ్రీధరన్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో బీజేపీ క్యాడర్ లో కొత్త ఊపు వచ్చింది. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం అభ్యర్థిగా తాను బరిలోకి దిగేందుకు సిద్ధమని శ్రీధరన్ ప్రకటించారు. మరోవైపు పరుగుల రాణిగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిన పీటీ ఉష కూడా బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

పీటీ ఉష ఇప్పటికే బీజేకీ అనుకూలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఆమె మద్దతు పలుకుతున్నారు. నిరసనలు చేపట్టిన రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేశారు. దీంతో ఆమె బీజేపీ కండువా కప్పుకోవటం దాదాపు ఖాయం అయిపోయినట్లే.

కానీ తాను బీజేపీలో చేరుతున్నట్టు ఉష ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆమె బీజేపీ చేరటం ఖాయం అనేలానే ఉన్నాయి పరిణామాలు. అంతేకాదు, ఈ వార్తలపై స్పందించేందుకు ఆమె సన్నిహిత వర్గాలు కూడా పెదవి విప్పటంలేదు. దీంతో మౌనం అంగీకారం అన్నట్లుగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… కేరళకు చెందిన పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులను బీజేపీ ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. వారితో ఎన్నికల గ్లామర్ పెంచి కమ్యూనిస్టుల కంచు కోటలో కాషాయ జెండా ఎగురవేయటానికి పావుల్ని అంత్యం జాగ్రత్తంగా కదుపుతోంది.