Indira Hridayesh : పార్టీ సమావేశానికి హాజరై..కాంగ్రెస్ కీలక నేత మృతి
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా హృదయేశ్(80) ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.
Indira Hridayesh ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా హృదయేశ్(80) ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. శనివారం న్యూ ఢిల్లీలో కాంగ్రెస్ ఉత్తరాఖండ్ ఇంఛార్జ్ దేవేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన ఇందిరా..ఆదివారం గుండెపోటుతో మరణించినట్లు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ ధస్మానా, ఇందిర కూమారుడు సుమిత్ హృదయేశ్ తెలిపారు. ఇందిర స్వస్థలమైన హల్ద్వానీలో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
హల్దానీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందిరా హృదయేశ్.. ఈ ఏడాది ఏప్రిల్ లో కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆమెకు హార్ట్ సర్జరీ జరిగింది.
ఇందిరా హృదయేశ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె సమర్థమైన నాయకురాలని ప్రధాని మోడీ కొనియాడారు.
ఇందిరా..చివరి వరకు ప్రజాసేవ మరియు కాంగ్రెస్ కుటుంబం కోసం పనిచేసిందని ఆమె సామాజిక, రాజకీయ సేవలు ఒక ఇన్ స్పిరేషన్ అని రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్ మురియు ఉత్తరాఖండ్ రాజకీయాల్లో ఇందిరా చాలా ప్రముఖ పాత్ర పోషించారని,ఆమె మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ తెలిపారు.