Bhojpuri Songs: డబుల్ మీనింగ్ సాంగ్స్పై బిహార్ మంత్రి ఆగ్రహం.. చర్యలు తప్పవని హెచ్చరిక
ఇటీవల బిహార్లో రూపొందుతున్న భోజ్పురి పాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ పాటల్లో వివిధ పార్టీలను, సామాజిక వర్గాలను కించపరిచేలా సాహిత్యం ఉంటోంది. అసభ్యత కూడా ఎక్కువైంది. వివాదాస్పద అంశాలతో పాట రూపొందించిన నేహా సింగ్ అనే గాయనికి ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Bhojpuri Songs: భోజ్పురి పాటల్లో డబుల్ మీనింగ్స్, అసభ్యత పెరిగిపోతుండటంపై బిహార్ అసెంబ్లీలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పాటలు రూపొందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ఒక తీర్మానంపై మంత్రి స్పందించారు.
ఇటీవల బిహార్లో రూపొందుతున్న భోజ్పురి పాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ పాటల్లో వివిధ పార్టీలను, సామాజిక వర్గాలను కించపరిచేలా సాహిత్యం ఉంటోంది. అసభ్యత కూడా ఎక్కువైంది. వివాదాస్పద అంశాలతో పాట రూపొందించిన నేహా సింగ్ అనే గాయనికి ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రతిమా కుమారి ఈ పాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భోజ్పురి ప్రైవేట్ సాంగ్స్లో అసభ్యత, హింస పెరిగిపోతోందన్నారు. ఈ పాటలు కులాల మధ్య విద్వేషాలు పెంచేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆమె అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
పాటల్లో డబుల్ మీనింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయన్నారు. దీనిపై బిహార్ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఇలాంటి పాటల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ‘‘రెచ్చగొట్టేలా ఉన్న పాటలు రూపొందించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఇలాంటి పాటలు రూపొందించిన వారికి నోటీసులు జారీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, జిల్లా పోలీసులకు ఈ విషయంలో ఆదేశాలు జారీ చేశాం. అభ్యంతరకర, ద్వంద్వార్థాలతో కూడిన పాటలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అసెంబ్లీలో ప్రకటించారు.