Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్పై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా
Raghunandan Rao : రఘునందన్ రావు వ్యాఖ్యలతో తమకు పరువు నష్టం జరిగిందని, తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం బ్లాక్ లిస్టులో లేని సంస్థను బ్లాక్ లిస్టులో ఉందని చెప్పడం కరెక్ట్ కాదని సంస్థ వ్యాఖ్యానించింది.
Raghunandan Rao-IRB : బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయన్న రఘునందన్ రావుపై వెయ్యి కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది ఐఆర్ బీ ఇన్ ఫ్రా(IRB Infra) సంస్థ. ఈ క్రమంలో రఘునందన్ రావుకు ఐఆర్ బీ సంస్థ లీగల్ నోటీసులు పంపింది.
ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ కి సంబంధించి అవకతవకలు జరిగాయని రఘునందర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఐఆర్ బీ అనే సంస్థ బ్లాక్ లిస్టులో ఉందని కామెంట్ చేశారు. బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు ఏ విధంగా ఓఆర్ఆర్ టెండర్లు కట్టబెడతారు? ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 30ఏళ్ల పాటు లీజ్ కు ఇవ్వడం సరైంది కాదు. ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని అంచనా వేసి రూ.7వేల 300 కోట్లకు మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వడం సరైంది కాదంటూ రఘునందన్ రావు అన్నారు.
భవిష్యత్తులో ఆదాయం లక్ష కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న IRB సంస్థకు ఏ విధంగా కాంట్రాక్ట్ కట్టబెడతారు అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ కామెంట్స్ ను ఐఆర్ బీ సీరియస్ గా తీసుకుంది. రఘునందన్ రావు వ్యాఖ్యలతో తమకు పరువు నష్టం జరిగిందని, తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం బ్లాక్ లిస్టులో లేని సంస్థను బ్లాక్ లిస్టులో ఉందని చెప్పడం కరెక్ట్ కాదని సంస్థ వ్యాఖ్యానించింది. పరువు నష్టం జరిగిందంటూ రఘునందన్ పై వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసింది ఐఆర్బీ.
దీనిపై రఘునందన్ రావు స్పందించారు. లీగల్ గా ఇచ్చిన నోటీసులను తాను లీగల్ గానే ఎదుర్కొంటానని చెప్పారు. కచ్చితంగా ఐఆర్బీ బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థే అని మరోసారి ఆయన తేల్చి చెప్పారు.