Malkajgiri: మల్కాజ్‌గిరి సీటుపై బీజేపీ కీలక నేతల ఫోకస్.. టిక్కెట్ రేసులో ఆ నలుగురు!

మల్కాజ్‌గిరి సీట్ నుంచి పోటీ చేస్తే విజయం పక్కా.. అనే కాన్ఫిడెన్స్‌తో నలుగురు ప్రముఖ నేతలు మల్కాజ్‌గిరి టిక్కెట్‌పై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు.

Malkajgiri: మల్కాజ్‌గిరి సీటుపై బీజేపీ కీలక నేతల ఫోకస్.. టిక్కెట్ రేసులో ఆ నలుగురు!

BJP leaders focus on Malkajgiri lok sabha constituency

Malkajgiri Lok sabha Constituency: హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం హాట్‌సీట్‌గా మారిపోయింది. గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు (BRS Party) ఝలక్ ఇచ్చిన మల్కాజ్‌గిరిపై కమలం పార్టీ ఆశలు పెంచుకుంటోంది. ఇతర రాష్ట్రాల ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీజేపీ (BJP) గ్యారెంటీగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ముఖ్య నేతలు నలుగురు పోటీకి సై అంటున్నారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? మల్కాజ్‌గిరి నుంచే ఎందుకు పోటీ చేయాలని అనుకుంటున్నారు?

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్‌గిరిపై బీజేపీ ఫోకస్ పెంచింది. మినీ భారత్‌గా పిలిచే ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ మళ్లీ పోటీ చేసే చాన్స్ లేకపోవడంతో.. మల్కాజ్‌గిరిని తమ ఖాతాలో వేసుకోడానికి వ్యూహాలు పన్నుతున్నారు కమలం నేతలు. ఆంధ్ర సెటిలర్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్లు ఎక్కువగా ఉండటం తమకు కలిసివస్తుందని ఆశిస్తున్నారు బీజేపీ నాయకులు. ఈ సీట్ నుంచి పోటీ చేస్తే విజయం పక్కా.. అనే కాన్ఫిడెన్స్‌తో నలుగురు ప్రముఖ నేతలు మల్కాజ్‌గిరి టిక్కెట్‌పై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు.

బీజేపీలో కీలక నేత, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్రావు (Muralidhar Rao), ఫైర్‌బ్రాండ్ నాయకురాలు విజయశాంతి (Vijayashanti), మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి (Chada Suresh Reddy), రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh) మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామ్‌చంద్రరరావు ఈ సారి పోటీకి ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతరేకంగా మల్కాజ్‌గిరి ఓటర్లు తీర్పు నిచ్చారు. ఇది దృష్టిలో పెట్టుకుని ముఖ్య నేతలు నలుగురు ఈసారి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Also Read: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ.. అదే టార్గెట్‌ తో బరిలోకి.. మైండ్ బ్లాకయ్యే ప్లాన్!

మాజీ ఎంపీ విజయశాంతి ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. ముఖ్య నేతలందరినీ అసెంబ్లీ పోటీ చేయాలని చెప్తున్న ఆమె మాత్రం.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనే బరిలో దిగుతానని చెబుతున్నారు. మెదక్ ఎంపీగా పనిచేసిన తాను మళ్లీ ఎంపీగానే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక హన్మకొండ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి సైతం మల్కాజ్‌గిరి టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు స్థానాల్లో హన్మకొండ ఎస్సీ రిజర్వ్ కాగా, మహబూబాబాద్ ఎస్టీలకు రిజర్వ్ కావడంతో సురేశ్‌రెడ్డి మల్కాజ్‌గిరిపై దృష్టి పెట్టారు. బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చురుగ్గా ఉన్న సురేశ్‌రెడ్డి మల్కాజ్‌గిరి అయితే ఈజీగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, పరిశీలకులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్‌తో సఖ్యతగా ఉంటూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.

Also Read: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ పోటీకి సై.. అంజ‌న్‌కుమార్ సలహాతో కంగుతిన్న అజ్జూ భాయ్!

ఇక బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు కూడా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఈయన పాదయాత్ర చేశారు. కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో మల్కాజ్‌గిరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. టిఫిన్ బైఠక్ నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇక మరోనేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా పోటీకి సై అంటున్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉండటం.. దాదాపు అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మల్కాజ్‌గిరిని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. 2014లో టీడీపీ గెలిచిన ఈ సీటు తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు రమేశ్. ఇలా నలుగురు కీలక నేతలు ఒకే సీటుపై ఫోకస్ చేయడం బీజేపీలో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న కమలం పార్టీ ఈ నలుగురిలో ఎవరికి చాన్స్ ఇస్తుందనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.