Samatha Kumbh 2023 Theppotsavam: సమతామూర్తి సన్నిధిలో 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం

సమతా కుంభ్‌ ఏడో రోజు కల్హారోత్సవం వైభవంగా సాగింది. 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం నిర్వహించారు.

Samatha Kumbh 2023 Theppotsavam: సమతామూర్తి సన్నిధిలో 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం

Updated On : February 12, 2023 / 5:48 PM IST

Samatha Kumbh 2023 Theppotsavam: ముచ్చింతల్‌లో సమతా కుంభ్‌ అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మత్సవాల నిత్య కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజు కల్హారోత్సవం వైభవంగా సాగింది. సమతామూర్తి సన్నిధిలో భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సామూహిక పుష్పార్చన కన్నుల పండువగా సాగింది. 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం నిర్వహించారు.


హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు నిత్య కార్యక్రమాలు వైభవంగా సాగాయి. సమతా సన్నిధిలో భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఉదయం 5 గంటల 45 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 6 గంటల నుంచి ఆరున్నర గంటల వరకు అష్టాక్షరీ మంత్రం, జపం నిర్వహించారు. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ఆరాధన.. సేవాకాలం నిర్వహించారు. అనంతరం శాత్తుముఱై జరిపించారు. తీర్థప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్వర్యంలో నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి.


ఇక విశేష ఉత్సవంలో భాగంగా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కల్హారోత్సవం, సామూహిక పుష్పార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు భగవద్గీతలో సూపర్‌ మెమొరీ టెస్ట్‌ నిర్వహించారు. ఇందులో భారత్‌తో పాటు అమెరికాకు చెందిన వేద విద్యార్థులు, ప్రజ్ఞా విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read: సమతా కుంభ్‌ లో కనులపండువగా డోలోత్సవం


సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. క్షీర సాగర శయనునికి, సర్వభూత భావనునికి, విశాల నేత్రునికి, లీలా విహారికి 18 రూపాలలో తెప్పోత్సవం జరిగింది. ఇందులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.