క్రీడా బడ్జెట్: అక్షరాలా రూ.2216.92 కోట్లు
భారత దేశంలో క్రీడాదరణతో పాటు క్రీడాపోషణ పెరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు పెరిగాయి. శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో భారత ప్రభుత్వం క్రీడలకు రూ. 2216.92 కోట్లను కేటాయించింది. గతేడాది పోల్చుకుంటే ఈసారి రూ.214.20 కోట్లు అదనంగా నిధులు అందించారు. 2018-19 బడ్జెట్లో క్రీడలకు రూ.2002.72 కోట్లు ఇచ్చారు. బడ్జెట్ వాటాల్లో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి అత్యధికంగా నిధుల్ని కేటాయించింది.
ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం లోక్సభలో వివరిస్తూ ఇలా పేర్కొన్నారు.
- ‘సాయ్’కి గతంలో రూ. 396 కోట్లుగా ఉన్న మొత్తాన్ని రూ. 450 కోట్లకు పెంచి రూ. 54 కోట్లను ఎక్కువగా కేటాయించారు. జాతీయ శిబిరాల నిర్వహణ, క్రీడాసామాగ్రి కొనుగోలు, క్రీడాకారుల ఖర్చులకు వీటిని వెచ్చిస్తారు.
- జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్డీఎఫ్) మొత్తాన్ని గణనీయంగా పెంచుతూ రూ. 2 కోట్ల నుంచి రూ. 70 కోట్లకు పెంచారు. గతంలో రూ. 63 కోట్లుగా ఉన్న క్రీడాకారుల ఇన్సెంటీవ్స్ను రూ. 89 కోట్ల వరకూ మంజూరు చేశారు.
- ప్లేయర్ల ప్రోత్సాహకాలు, అవార్డుల్లో భాగంగా ఇచ్చే క్యాష్ ప్రైజ్ను రూ. 316.93 కోట్ల నుంచి రూ. 411 కోట్లకు పెంచారు.
- ‘ఖేలో ఇండియా’కు రూ.601 కోట్లు కేటాయించారు. దీనికి గతంలో (రూ.550.69 కోట్లు)గా ఉండేది.
క్రీడా సమాఖ్యకు మాత్రం
జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు చేసే చెల్లింపుల్లో స్వల్పంగా కోత విధించారు. గతంలో రూ.245.13 కోట్లు కేటాయించగా ఈ సారి మాత్రం కేవలం రూ.245 కోట్లకు పరిమితం చేశారు.