చిత్తు చేశారు: బంగ్లాపై భారత్ భారీ విజయం

చిత్తు చేశారు: బంగ్లాపై భారత్ భారీ విజయం

టెస్టు సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ కే విజయం దక్కింది. మూడు రోజుల పాటు సాగిన మ్యాచ్ లో టీమిండియా 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 493పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చిన భారత్‌ను రెండు ఇన్నింగ్స్ లు ఆడిన బంగ్లా చేరుకోలేకపోయింది. 

తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్ లో 213పరుగులకే మరో సారి ఆలౌట్ అయింది. షమీ 3వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో 2వికెట్లు తీయగలిగారు.  

సొంతగడ్డపై భారత్ వరుసగా మూడో విజయం సాధించి టీమిండియా చరిత్ర సృష్టించింది. మూడో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోరు 413పరుగులతో ఆరంభించిన కోహ్లీసేన కాసేపటికే డిక్లేర్ పలికింది. శనివారం ఆటలోనూ అదే దూకుడును ప్రదర్శించి 493పరుగులకు చేరింది. స్ట్రైకింగ్ లో ఉన్న ఉమేశ్ యాదవ్(25; 10బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)తో అదరగొట్టాడు. మరో ఎండ్ లో రవీంద్ర జడేజా(60)లతో కలిసి నాటౌట్ గా నిలిచారు. 

మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి 343పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి రోజు 86/1తో ముగించిన టీమిండియా స్కోరును మయాంక్ డబుల్ సెంచరీతో పరుగులు పెట్టించాడు. రెండో రోజు ఆటలో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. సమయోచితంగా ఆడుతూ అడపదడపా బౌండరీలతో భారీ స్కోరు చేశారు. ఈ క్రమంలోనే పూజారా, రహానె, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీకి మించిన వ్యక్తిగత స్కోరు నమోదు చేయగలిగారు. 

రెండో రోజు ఆటలో కోహ్లీసేన ఆరంభంలోనే రెండు వికెట్లు పోగొట్టుకుంది. పూజారా(54) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అబు జాయేద్ బౌలింగ్ లో సైఫ్ హస్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిపాటి విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) డకౌట్ గా నిరాశపరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అజింకా రహానె(86), వృద్ధిమాన్ సాహా(12), ఉమేశ్ యాదవ్(25) చక్కటి ఇన్నింగ్స్ కనబరిచారు. బంగ్లా బౌలర్లలో అబూ జాయేద్ 4వికెట్లు పడగొట్టగా, ఇబాదత్ హుస్సేన్, మెహిదీ హసన్ చెరో వికెట్ చేజిక్కించుకున్నారు.