CM KCR On BJP : ఇక యుద్ధమే, వాళ్లు ఒకటంటే మీరు పది అనండి- బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
బీజేపీ యుద్ధమే అని కేసీఆర్ ప్రకటించారు. ఆ పార్టీ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు గులాబీ బాస్.
CM KCR On BJP : టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, మునుగోడు ఫలితం, బీజేపీతో పోరాటం సహా పలు కీలక అంశాలపై నేతలతో చర్చించారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. బీజేపీ యుద్ధమే అని కేసీఆర్ ప్రకటించారు. రానున్న పది నెలలు చాలా కీలకం అన్నారు. బీజేపీ మరింతగా రెచ్చిపోతుందన్న కేసీఆర్.. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దన్నారు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చొద్దని సూచించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన పని లేదన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ 10 నెలలు కష్టపడాలని కేసీఆర్ అన్నారు.
కాగా, మునుగోడు ఉపఎన్నిక ఫలితాల్లో మెజారిటీ తగ్గడంపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.
”బీజేపీతో యుద్ధమే. వాళ్లు ఒక్కటంటే మీరు పది అనండి. ఇది ఎన్నికల ఏడాది. 10 నెలల సమయం ఉంది. అందరూ నిత్యం ప్రజల్లో ఉండాలి. అందరినీ కలుపుకొని పోవాలి. బీజేపీ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. అనవసర వివాదాల్లోకి వెళ్లకండి. బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలి. బీజేపీతో పోరాడాల్సిందే. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర కూడా ప్రయత్నించి అడ్డంగా దొరికారు. ఆ పార్టీ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదు” అని కేసీఆర్ అన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం హాట్ హాట్ గా సాగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.
టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపైనా స్పష్టత ఇచ్చారు కేసీఆర్. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు పది నెలల సమయమే ఉందన్న కేసీఆర్.. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో టచ్ లో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కేసీఆర్ సూచించారు.