KCR Public Meeting : అక్టోబర్ 27న మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
నాడు ఎడారిలాగా ఉన్న తెలంగాణ నేడు పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అంత బూటకం అన్నారు.

CM KCR Public Meeting
KCR Public Meeting Mahabubabad : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సభలు, సమావేశాలతో బీజీ అయ్యారు. ఇందులో భాగంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేపట్టింది. అక్టోబర్ 27 న మహబూబాబాద్ లోని శనగపురం రహదారిలో సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ జరుగనుంది. బహిరంగ సభకు హెలీప్యాడ్ , సభాస్థలిలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పి చైర్ పర్సన్ బింధు పరిశీలించారు.
నాడు ఎడారిగా తెలంగాణ.. నేడు పచ్చదనంతో సస్యశ్యామలం : మంత్రి ఎర్రబెల్లి
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. నాడు ఎడారిలాగా ఉన్న తెలంగాణ నేడు పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అంత బూటకం అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితలు, గిరిజనులకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ రాహుల్ గాంధీ జిమ్మికులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అక్టోబర్ 27న మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలువుతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అక్టోబర్ 27న మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
ఇంకా అభ్యర్థులను ప్రకటించని దుస్థితిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నిర్ణయాలు ఢిల్లీలో ఉంటాయని, బీఆర్ఎస్ నిర్ణయాలు మన గల్లీలోనే ఉంటాయని తెలిపారు. ఢిల్లీ గులాంలు కావాలో మన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు.