Airport Metro: ఐదేళ్ల ఆలోచనకు శ్రీకారం.. ఎయిర్పోర్ట్ మెట్రోకు నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన.. ప్రత్యేకతలివే..
అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
Airport Metro: అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. నాగోల్ – రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10గంటలకు మైండ్స్పేస్ వద్ద పునాదిరాయి వేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ మెట్రో ప్రాజెక్టులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు. ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించేలా సీట్లు (చైర్కార్లు) ఉంటాయి. ప్లాట్ ఫాంపై భద్రతకోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్లో మెట్రో రైలు ఆగిన తర్వాత కోచ్ల తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి. కారిడార్ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మిస్తారు. వాటికి ప్రయాణికులు చేరుకునేలా స్కైవాక్లు ఏర్పాటు చేస్తారు. రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్లు ఉంటాయి. అదేవిధంగా స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేస్తారు. సీఐఎస్ఎఫ్ పోలీసుల సమన్వయంతో లగేజీ తనిఖీ చేస్తారు.
Metro Project: మెట్రో ప్రాజెక్ట్తో రియల్ ఎస్టేట్ జోరు
సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు ఐదేళ్ల క్రితమే ఆలోచన చేశారు. అయితే, ఆ ఆలోచనకు నేటి శంకుస్థాపనతో శ్రీకారం చుట్టనుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణికులు ఎయిర్పోర్టుకు చేరుకునేలా ఎక్స్ప్రెస్ మెట్రోను మెట్రో రెండో దశలో చేర్చాలని 2018 జనవరిలో అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. శంకుస్థాపన అనంతరం అతిత్వరలో గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. భూ సేకరణ సమస్యలు లేనందువల్ల మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
ప్రాజెక్టు వ్యయం – రూ. 6,250 కోట్లు
మొత్తం దూరం – 31 కి.మీ
ఆకాశమార్గం (ఎలివేటెడ్) – 27.5 కి.మీ.
భూమార్గం (విమానాశ్రయంలో) – 1 కి.మీ.
భూగర్భం (విమానాశ్రయంలో) 2.5 కి.మీ.
స్టేషన్లు – తొమ్మిది
రాయదుర్గం నుంచి శంషాబాద్కు – 26 నిమిషాలు
ప్రాజెక్ట్ పూర్తికి నిర్దేశించుకున్న గడువు – 3ఏళ్లు