Kotha Prabhakar Reddy : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్
ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Kotha Prabhakar Reddy
BRS MP Kotha Prabhakar Reddy : మెదక్ ఎంపీ, దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఎంపీపై దాడిచేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. రాజు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అయితే, ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాజుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజుపై 307 తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజు ఏ1గా ఉన్నాడు.
Also Read : Kotha Prabhakar Reddy : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి
ఘనటపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ అయ్యగారి నర్సింహులు ఘటన జరిగిన సమయంలో రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపైనా కేసు నమోదు చేసిన దౌల్తాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డికి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండనున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.