CM KCR On BJP : బీజేపీలో చేరాలని కవితపై ఒత్తిడి తెచ్చారు, జగన్ని దెబ్బకొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు-సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తన కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ మారమని బీజేపీ నేతలు అడిగారని, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అని కేసీఆర్ అన్నారు. కేంద్రానికి ఏపీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నా.. వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు.
CM KCR On BJP : ఇక బీజేపీతో తాడోపేడో తేల్చుకుందామని, ఇక వారితో యుద్ధమేనన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రానున్న 10 నెలలు చాలా కీలకం అన్నారు గులాబీ బాస్. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
బీజేపీ మరింతగా రెచ్చిపోతుందన్న కేసీఆర్.. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని, వివాదాస్పద విషయాల్లో తలదూర్చొద్దని సూచించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన పని లేదన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ 10 నెలలు కష్టపడాలన్నారు.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో మెజార్టీ తగ్గడంపైనా సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. బీజేపీతో ఇక యుద్ధం చేయాలన్న కేసీఆర్.. వాళ్లు ఒకటంటే మీరు పది అనాలని నేతలకు సూచించారు. ప్రజాప్రతినిధులందరూ నిత్యం ప్రజల్లో ఉండాలని, అందరినీ కలుపుకుని పోవాలని అన్నారు.
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో బీజేపీపై సమరశంఖం పూరించిన గులాబీ బాస్.. సంచలన ఆరోపణలు చేశారు. నా కూతురినే పార్టీ మారమని బీజేపీ నేతలు అడిగారని.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా అని కేసీఆర్ అన్నారు. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. కేంద్రానికి ఏపీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నా.. అక్కడ వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీలో చేరాలని కవితపై ఒత్తిడి తెచ్చారని, వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
”నా కూతురు కల్వకుంట్ల కవితను పార్టీ మారమని బీజేపీ నేతలు అడిగారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? కేంద్రానికి ఏపీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నా.. వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోంది. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? పార్టీ మారాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో నాకు అన్నీ తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ బీజేపీకి లొంగవద్దు. సమావేశం వివరాలు ఎక్కడా బయటకు చెప్పొద్దు. అందరిపై నిఘా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదు. ఈసారి కూడా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తాం” అని కేసీఆర్ స్పష్టం చేశారు.
”ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరూ లొంగిపోవద్దు. ప్రలోభాలకు లొంగి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. బీజేపీ నేతల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా నాకు సమాచారం ఇవ్వాలి. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చర్చిద్దాం. కేంద్రానికి అనుకూలంగా ఉన్నా.. ప్రభుత్వాలను కూడా వదలడం లేదు. మరింతగా సరెండర్ కావాలని ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. జగన్ పరిస్థితి అలానే ఉంది. జగన్.. కేంద్ర ప్రభుత్వానికి ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. వైసీపీని దెబ్బకొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు బీజేపీ వాళ్లు. తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ నేతలంతా రెడీగా ఉండాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఏ విధంగా అయితే తెలంగాణలో గండి పడిందో, అదే విధంగా తెలంగాణ నుంచే బీజేపీని గద్దె దించే కార్యక్రమం జరగబోతోంది. దానికి బీఆర్ఎస్ ద్వారా ప్రయత్నం చేద్దాం” అని కేసీఆర్ అన్నారు.
కాగా, బీజేపీలో చేరాలని కవితను కోరింది ఎవరు? బీజేపీ కీలక నేతలా? లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఈడీ, సీబీఐ అధికారులా? అసలు కోరింది ఎవరు? ఈడీ, సీబీఐలు కూడా పార్టీలు మారాలని ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ మారాలని కవితను కోరింది ఎవరు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేసీఆర్ చేసిన ఈ సంచలన ఆరోపణలకు బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.