Eatala Jamuna: ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా?
తెలంగాణ బీజేపీ ప్రయోగాలకు సిద్ధమవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించే ప్రణాళికకు పదునెక్కిస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
![Eatala Jamuna: ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా? Eatala Jamuna: ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా?](https://10tv.in/wp-content/uploads/2023/10/Etala-Jamuna.jpg)
etala jamuna likey to contest in huzurabad
Etala Jamuna Huzurabad : అక్కడా నేనే.. ఇక్కడా నేనే.. అంటూ రెండు చోట్ల పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్పై గజ్వేల్లో బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చేశారు ఈటల. మరి తన సొంత నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడం ఖాయమేనా.. అసలు బీజేపీలో ఒకే నేత రెండు చోట్ల పోటీ కుదురుతుందా? అక్కడా.. ఇక్కడా పోటీ అనడం వెనుక మతలబు ఏంటి? బీజేపీ రాజకీయాల్లో ఈటల సతీమణి జమున పాత్ర ఏంటి?
తెలంగాణ బీజేపీ ప్రయోగాలకు సిద్ధమవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించే ప్రణాళికకు పదునెక్కిస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. సీఎం కేసీఆర్పై గజ్వేల్లో సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపడం ద్వారా మొత్తం ఎన్నికల వాతావరణాన్నే మార్చేయాలని ప్లాన్ చేస్తోంది కమలదళం. అటు ఈటల కూడా పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీని మట్టి కరిపించిన సువేందు అధికారిని ఆదర్శంగా తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
పార్టీ గెలిచినా, ఓడినా కేసీఆర్ ను ఓడిస్తే చాలనుకుంటున్నారట ఈటల. ఇందుకోసమే గజ్వేల్ బరిలో దిగేందుకు సిద్ధమౌతున్నారని చెబుతున్నారు. అయితే సొంత నియోజకవర్గం హుజురాబాద్ నుంచి తన సతీమణి జమునను బరిలోకి దింపేలా పావులు కదుపుతున్నట్లు కన్పిస్తోంది. ఇంతవరకు ఈ విషయంపై బహిరంగంగా ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు చెబుతున్నారు.
సీనియర్ నేత ఈటల తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు చేపట్టారు. కానీ, ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ, ఈటల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక.. సీఎం కేసీఆర్ తమను వేధిస్తున్నారంటూ రోడ్డెక్కారు ఈటల కుటుంబ సభ్యులు. ఈటల సతీమణి జమున అయితే పత్రికా సమావేశాలు పెట్టి కేసీఆర్ ను, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
Also Read: అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!
హుజురాబాద్ ఉప ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న ఈటల జమున.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ హాజరైన జమ్మికుంట బహిరంగ సభలో ఈటల జమున హల్చల్ చేశారు. వేదికపై ఆమె ప్రధాన ఆకర్షణగా కనిపించడంతో ఈటల జమున రాజకీయ ప్రవేశంపైనా.. ఎన్నికల్లో పోటీపైనా విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీలో ఒకే నేతకు రెండు టికెట్లు ఇచ్చే ఆనవాయితీ లేకపోవడం కీలకమైన ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు ప్రత్యర్థిగా ఈటల పోటీ చేయడం దాదాపు ఖాయం కావడంతో.. సొంత నియోజకవర్గంలో ఆయన సతీమణి జమున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈటల గజ్వేల్లో పోటీచేస్తే.. జమున హుజురాబాద్ బరిలో నిలుస్తారని అంటున్నారు. జమునకు టికెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉండటం వల్లే రెండు చోట్ల పోటీకి సై అంటూ ఈటల ప్రకటన చేశారని అంటున్నారు. అందుకే ఎన్నికల ప్రచార సభల్లో జమున చురుగ్గా పాల్గొంటున్నారని చెబుతున్నారు.