JNTU: ఒకేసారి రెండు డిగ్రీలు.. ఈ ఏడాది నుండే అమలు!

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU) డిగ్రీ విద్యలో సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఒకసారి ఒకే డిగ్రీని మాత్రమే అభ్యసించే వీలుండగా ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు చదివేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. అది కూడా ఈ ఏడాది నుండే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

JNTU: ఒకేసారి రెండు డిగ్రీలు.. ఈ ఏడాది నుండే అమలు!

Jntu

JNTU: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU) డిగ్రీ విద్యలో సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఒకసారి ఒకే డిగ్రీని మాత్రమే అభ్యసించే వీలుండగా ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు చదివేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. అది కూడా ఈ ఏడాది నుండే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని ప్రకారం ఇక నుంచి బీటెక్‌ విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తిచేయవచ్చు. సీటు వచ్చిన బ్రాంచిలో మేజర్‌ డిగ్రీతోపాటు విద్యార్థులకు నచ్చిన మరో కోర్సులో మైనర్‌ డిగ్రీని పూర్తిచేయవచ్చు.

నిజానికి 2020-21 విద్యాసంవత్సరంలోనే అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా.. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో అది అమలు సాధ్యం కాలేదు. అయితే, ఇప్పటికే ఐఐటీల్లో ఈ డబుల్ డిగ్రీ విధానం అమల్లో ఉండగా.. ఈ విధానాన్ని అధ్యయనం చేసిన జేఎన్టీయూ అధికారులు.. ఆ నివేదికను సెనేట్‌ ముందుంచగా ఆమోదం తెలిపింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ డ్యూయల్‌ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టాలని జేఎన్టీయూ అకడమిక్‌ సెనేట్‌ సమావేశంలో తీర్మానించగా.. విధి విధానాలను రూపొందించేందుకు నిపుణుల కమిటీని నియమించనున్నారు.

బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ కోర్సులను కోర్‌ కోర్సులుగా వ్యవహరించే సంగతి తెలిసిందే కాగా అప్పడెప్పుడో ప్రవేశపెట్టిన ఈ కోర్సుల పట్ల విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడంలేదు. అందుకే ఈ కోర్‌గ్రూపుల్లో 70 వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌గా పేరొందిన కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IOT), మెకట్రానిక్స్‌ వంటి కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తిచూపుతున్నారు. అందుకే కొర్ గ్రూపులకు ప్రత్యామ్నాయంగా డ్యూయల్‌ డిగ్రీలను ప్రవేశపెట్టాలని JNTU అధికారులు నిర్ణయించారు.