Ys Jagan : అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు మళ్లీ పెట్టేవరకూ నిరసనలు ఆగవు : అంబటి రాంబాబు
Ambati Rambabu : విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న జగన్ మోహన్ రెడ్డి అనే అక్షరాలను గుర్తుతెలియని దుండగులు తొలగించారు. దీనిపై వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది.
![Ys Jagan : అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు మళ్లీ పెట్టేవరకూ నిరసనలు ఆగవు : అంబటి రాంబాబు Ys Jagan : అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు మళ్లీ పెట్టేవరకూ నిరసనలు ఆగవు : అంబటి రాంబాబు](https://10tv.in/wp-content/uploads/2024/08/Ys-Jagan-Reddys-name-removed-from-BR-Ambedkars-statue-plaque.jpg)
Ys Jagan Reddy's name removed from BR Ambedkar's statue plaque ( Image Source : Google )
Ambati Rambabu : విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ జగన్ పేరు తొలగించడంపై నిరసనగా శంకర్ విలాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీని వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పేరు తీసేసిన చోట జగన్ పేరు పెట్టే వరకు నిరసనలు తెలుపుతామన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలు, జగన్ పేరు ఉన్న శిలా ఫలకాలు పగల కొట్టడం సిగ్గుచేటుగా మండిపడ్డారు.
వైసీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనం వద్ద లైట్లు ఆపేసి జగన్ పెరు తొలగించారని అంబటి ఆరోపించారు. అధికార పార్టీ కార్యకర్తలే అర్ధరాత్రి దాడి చేశారని, దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని అంబటి డిమాండ్ చేశారు. దాడి చేసింది ఆ పార్టీ కార్యకర్తలే కాబట్టి వారిపై కేసు నమోదు చేయలేదని విమర్శించారు.
ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు : పోలీసు కమిషనర్
విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న జగన్ మోహన్ రెడ్డి అనే అక్షరాలను గుర్తుతెలియని దుండగులు తొలగించారు. దీనిపై వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అంబేద్కర్ విగ్రహం సందర్శించి విచారణ చేపట్టామని ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు పేర్కొన్నారు.
అయితే, కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు దీనిని వక్రీకరించి కొందరు వ్యక్తులు విగ్రహ ధ్వంసానికి పాల్పడటమే కాకుండా అంబేద్కర్ను అవమానించినట్లుగా దుష్ప్రచారం చేస్తూ కొన్ని సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్ఛ గొడుతూ వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని పోలీసు కమిషనర్ తెలిపారు.
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దళిత సంఘాలు ఇలాంటి వక్రీకరించిన సమాచారాన్ని, అబద్దపు ప్రచారాన్ని అసలు నమ్మవద్దని పోలీసు కమిషనర్ సూచించారు. విజయవాడ స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించగా, రాష్ట్ర సీఎం హోదాలో జగన్ ప్రారంభించారు. విగ్రహం ముందు స్టీల్ ఎంబోజ్డ్ అక్షరాలు ఏర్పాటు చేశారు. అయితే, కొందరు దుండగులు ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి’ పేరున్న అక్షరాలను తొలగించారు.