AP High Court : సజ్జలకు హైకోర్టు నోటీసులు.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పిటీషన్‌పై విచారణ

ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం కేడర్ రూల్స్ కు విరుద్ధం అని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రజాధనాన్ని వినియోగించి వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.

AP High Court : సజ్జలకు హైకోర్టు నోటీసులు.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పిటీషన్‌పై విచారణ

High Court Notices To Sajjala (Photo : Google)

వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ ఈ పిటీషన్ పై తమ వాదనలు వినిపించారు. ప్రజాధనాన్ని వినియోగించి, ప్రభుత్వ ఉద్యోగులతో వై ఏపీ నీడ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం కేడర్ రూల్స్ కు విరుద్ధం అని న్యాయవాదులు వాదించారు.

ప్రజాధనాన్ని వినియోగించి వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ప్రభుత్వ సలహాదారు.. ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసి కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తున్నారని న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం జగన్ చేసిన అతి పెద్ద తప్పు, వైసీపీ ఫ్యాన్ ఆగిపోవడం ఖాయం : లోకేశ్

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అనేందుకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. కార్యక్రమానికి హాజరు కాలేదని గుత్తి మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగికి మెమో జారీ చేసిన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాదులు. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

వై ఏపీ నీడ్స్ జగన్ ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై పిటీషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, ప్రభుత్వ సొమ్ము వాడటం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన ఇచ్చారని కోర్టుకు తెలిపారు. దీంత ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సీఎస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ పిల్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా, విచారణ అర్హత ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ సొమ్ముతో సీఎం జగన్ రాజకీయ ప్రచారం చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందన్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 7 విడుదల చేశారని కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సజ్జల చెప్పారని కోర్టుకు తెలిపారు. ఇలా చెప్పడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Also Read : ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లుంటే తొలగించాలి.. ఈసీకి వైసీపీ నేతల విజ్ఞప్తి

వై ఏపీ నీడ్స్ జగన్ రాజకీయ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నిలువరించాలని హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలైంది. రాజకీయ కార్యక్రమానికి ప్రభుత్వ ధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలని పిటిషన్ లో కోరారు. పలువురు అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసేలా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ప్రభావితం చేసేలా ఈ కార్యక్రమం ఉందని పిటిషనర్ ఆరోపించారు.