Kottu Satyanarayana : ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించాడా? : కొట్టు సత్యనారాయణ
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.

Deputy CM Kottu Satyanarayana
Kottu Satyanarayana – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దొంగ నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించాడా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరి పోతులను చేస్తున్నారన్న చంద్రబాబు..మాట మార్చి జగన్ కన్నా ఎక్కువ పథకాలు అందిస్తామంటున్నాడని తెలిపారు.
శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. మాలోకం(లోకేష్) చేసేది యువగళం యాత్ర కాదు గందరగోళం యాత్ర అని ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్రలో బౌన్సర్లు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
YSR Congress Party: అన్ని జిల్లాలకు వైసీపీ నూతన కార్యవర్గం.. ఆ రెండు జిల్లాలు మినహా అంతా పాతవారే..
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి గందరగోళం సృష్టించారని విమర్శించారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ రోజుకు రూ.2 కోట్లకు కాల్ షీట్ ఇచ్చారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమా వ్యామోహంతో కాపు యువతను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. 32 లక్షల మందికి ఇళ్ళు కట్టించిన ఘనత జగన్ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. కరోనా కష్ట కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఆదుకున్నారని తెలిపారు.
మన భారతదేశం గర్వపడేలా చంద్రయాన్ 3ని మన శాస్త్రవేత్తలందరూ విజయవంతంగా పంపించారని తెలిపారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందన్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం చేసే ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా అంత మంచే జరిగిందని చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 6 జాతీయ అవార్డు రావడం సంతోషకరమని అన్నారు.