మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు, పెన్షన్- చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం

క్యాపిటల్ సిటీ ఎంతవరకు ఉంటే.. అంతవరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం.

మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు, పెన్షన్- చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం

Pensions For Amaravati Farmers (Photo Credit : Google)

Amaravati Development : రాజధాని అమరావతి, రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వివరాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు కౌలు, పెన్షన్ మరో ఐదేళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ వెల్లడించారు.

”రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు. చంద్రబాబు మీదున్న నమ్మకంతో భూములిచ్చారు. గత ఐదేళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు. రైతు కూలీలకు పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించాం. కొందరు రైతు కూలీలు వివిధ పనులు చేసుకుంటున్నారని గత ప్రభుత్వం వారికి పింఛను ఆపేసింది. వారికి తిరిగి పింఛను ఇచ్చే విషయంపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నాం. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నాం. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించాం.

సోమవారం నుంచి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులని నియమించుకుంటాం. సీఆర్డీఏ కోసం 32 కన్సల్టెన్సీలు తీసుకోవడానికి అథారిటీ నిర్ణయించింది. జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిని 6,993.24 చదరపు కిలోమీటర్లకు కుదించింది. గతంలో లాగానే 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం.

తిరిగి పాత విధానం మేరకు పరిధి ఉండాలని అథార్టీలో నిర్ణయించాం. కోర్ క్యాపిటల్ ఏరియాను తిరిగి 217 చదరపు కిలోమీటర్ల ఉంచేలా నిర్ణయం. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం.

కరకట్ట రోడ్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించాం. 130 మందికి సైట్ ఇచ్చాం. అందులో ఇనాక్టివ్ గా ఉన్న వారితో చర్చించాలని నిర్ణయం తీసుకున్నాం. కరకట్ట రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ. క్యాపిటల్ సిటీ ఎంతవరకు ఉంటే.. అంతవరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిలోని ఈ-5,11,13,15 రోడ్లను ఎన్ హెచ్ కు కలిపేలా చర్యలు. అమరావతికి ఈఆర్ఆర్, ఓఆర్ఆర్ లు ఉంటాయి. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించనున్నాం” అని మంత్రి నారాయణ వెల్లడించారు.

Also Read : ఏకంగా 59 మంది డీఎస్పీలను పక్కన పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. నారా లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేసేశారా?