విజయసాయితో బొత్సకు తప్పదా షాక్?

  • Published By: sreehari ,Published On : December 28, 2019 / 11:21 AM IST
విజయసాయితో బొత్సకు తప్పదా షాక్?

Updated On : December 28, 2019 / 11:21 AM IST

రాజధాని అంశంపై ఎక్కువగా మాట్లాడాల్సింది మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. నిజానికి ఇన్నాళ్లూ ఆయనే మాట్లాడారు కూడా. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన్ని హైజాక్ చేస్తూ జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి భారీ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం పట్ల మంత్రి గారు తెగ ఫీల్ అవుతున్నారట.

జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత విశాఖ టూర్ చేసిన విజయసాయిరెడ్డి… భీమిలీ రాజధాని ప్రాంతమని కచ్చితంగా చెప్పేశారు. ఆయనేమీ మీడియాతో చెప్పలేదు. భీమిలీలో జరిగిన ఓ బహిరంగ సభలోనే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అలాంటి దాన్ని ఇపుడు బొత్స సత్యనారాయణ ఖండించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని జనాలు అనుకుంటున్నారు.

మీడియాకు ఎందుకు తొందర. విశాఖలో రాజధాని ఎక్కడో తానే చెబుతానంటూ బొత్స సత్యనారాయణ తన పెద్దరికాన్ని చాటుకోవడానికి పడిన తాపత్రయంపై వైసీపీలోనే చెవులు కొరుక్కుంటున్నారు. విశాఖలో రాజధాని విషయమై తమ ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని, ఆ కమిటీ అనువైన స్థలం చూసి నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకుంటామని బొత్స అంటున్నారు అప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రానట్టేనట. ఇది చూసిన జనాలు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనకు విలువ లేదని బొత్స సత్యనారాయణ చెప్పదలచుకున్నారా ఏంటి అని గుసగుసలాడుతున్నారు.

సైడ్ చేస్తున్నారనే బాధతోనేనా? :
మరోపక్క, విజయసాయిరెడ్డి భీమిలీ టూర్‌లో ఈ ప్రాంతమే రాజధాని నగరం అవుతుందని ప్రకటించేశారు. ఇది జగన్ తనతో పంచుకున్న మాటగా కూడా అయన అనడం విశేషం. అన్ని విధాలా అనువైన ప్రాంతం భీమిలీ అని కూడా చెప్పుకొచ్చారు. ఓ విధంగా జగన్ ఆత్మగా వైసీపీలో విజయసాయిరెడ్డిని అంతా భావిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతున్నారనే టాక్‌ కూడా ఉంది. మరి విజయసాయిని కాదని బొత్స సత్యనారాయణ ఇలా చెప్పడం అంటే లోలోపల తనను సైడ్ చేస్తున్నారన్న బాధను బొత్స ఈ విధంగా వ్యక్తం చేశారని అంటున్నారు.

నిజానికి బొత్స సత్యనారాయణను రాజధాని విషయంలో లీకులు ఇవ్వడానికి గతంలో బాగానే ఉపయోగించుకున్నారు. అమరావతి రాజధాని ఉండదని చెప్పడానికి బొత్స వివిధ సందర్భాల్లో వివాదాస్పద ప్రకటనలు చేశారు. అది కూడా ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఆయన ఆ విధంగా మాట్లాడారనే ప్రచారం ఉంది. తీరా రాజధాని అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. చివరిగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ కీలకమైన ప్రకటన చేసి ఏపీలో హాట్ టాపిక్‌గా దానిని మార్చారు.

ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏకంగా రంగంలోకి దిగి, స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. దీంతో బొత్సను కూరలో కరివేపాకులా వాడి వదిలేశారని జనాలు అనుకుంటున్నారు. బొత్స కూడా ఈ విషయంలో బాగా ఫీలైపోతున్నారట. రాజధానిపై క్లారిటీగా ఒకసారి జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చాక ఇక బొత్స పాత్ర ముగిసినట్లేనని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. భీమిలీ రాజధాని కాదని బొత్స అనడం వెనక తనను తక్కువ చేస్తున్నారని ఆవేదన తప్ప ఇంకేం కాదని అంటున్నారు.

పార్టీలో అసలు విషయాలు విజయసాయిరెడ్డి కంటే ముందుగా తెలిసిన వారు ప్రభుత్వంలో ఇంకెవరూ లేరని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మొత్తానికి బొత్స సత్యనారాయణ పేరుకే మంత్రిగా మిగిలిపోతున్నారనే టాక్‌ అయితే బాగా నడుస్తోంది. మరి ఈ విషయంలో బొత్స ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిందే.