Chandrababu Naidu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐడియాను కాపీ కొట్టి..: చంద్రబాబు
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ..
Free Bus Service: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కాపీ కొట్టి సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తానంటున్నారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతోనే జగన్ తమ హామీని కాపీ కొట్టారని విమర్శించారు. ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినా.. ఏపీలో ధరల రూపేణా దోచింది తిరిగి ఇస్తారా? అని అన్నారు.
ఉండవల్లిలోని ఆయన నివాసంలో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీ యాగం, సుదర్శన హోమాలు ముగిశాయి. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తాడట అంటూ ఎద్దేవా చేశారు.
కోర్టులు చివాట్లు పెట్టినా సిగ్గుపడట్లేదని విమర్శించారు. ఏపీ పరిస్థితిని చూస్తే బాధేస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు బాగుండాలనే యజ్ఞాలు చేశానని ఆయన చెప్పారు. అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకుంటే జీవితాలకు మరణ శాసనం రాసుకున్నట్లేనన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే తాను అక్కడ ఉంటానని తెలిపారు. 40 ఏళ్ల అనుభవంతో తాను కష్టపడతానని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చుతానని అన్నారు.
తన సినిమా అయిపోయిందని జగన్కు అర్థమైంది..
రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్ను ప్రజలు క్షమించాలా? అని చంద్రబాబు అడిగారు. తన సినిమా అయిపోయిందని జగన్కు కూడా అర్థమైందని చెప్పారు. వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు సీఎం జగన్నే మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని నిలదీశారు. పరిశ్రమలన్నీ పారిపోయాయి, ఒక్కరికీ ఉద్యోగం రాలేదని విమర్శించారు.