బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ఇవాళ(నవంబర్-14,2019)బాలల దినోత్సవం. ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటాయి కానీ, భారత్లో మాత్రం ఆరు రోజులు ముందుగానే దీన్ని నిర్వహించుకుంటారు.
భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ. అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించింది కూడా ఆయనే. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె ఇందిరకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రు తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి విషయాలు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు. నెహ్రూ నింపిన స్ఫూర్తి, ధైర్యంతో ఇందిర ‘ఉక్కు మహిళ’గా రూపొందారు. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవే.
పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయనని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 14ను ‘చిల్డ్రన్స్ డే’గా జరుపుకొంటున్నాం.
స్వాతంత్య్రానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అన్ని దేశాలతోపాటు నిర్వహించుకునేవాళ్లం. నవంబరు 20న చిల్డ్రన్స్ డే నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలు తీర్మానించాయి. 1964 వరకు భారత్ కూడా దీనినే అనుసరించినా నెహ్రు మరణం తర్వాత నుంచి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది.