మహిళా సంఘాలకు రూ.1400 కోట్లు, సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలిచింది. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. శుక్రవారం(ఏప్రిల్ 24,2020) క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. ఈ బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8లక్షల 78వేల 874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతలో డబ్బులు జమ అయ్యాయి.
8లక్షల 78వేల గ్రూపుల్లోని 90 లక్షల మంది మహిళలకు ప్రయోజనం:
90లక్షల 37వేల 254 మంది మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యాయి. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో స్వయం సహాయక సంఘాలకు సీఎం జగన్ అండగా నిలిచారని, కష్టకాలంలో వడ్డీ రాయితీ లభించడంతో పొదుపు సంఘాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సున్నా వడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మలకు మేలు:
2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయిందని జగన్ చెప్పారు. మొట్టమొదటిగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీకే రుణాలు పథకం తెచ్చారని చెప్పారు. రూపాయి పైచిలుకు ఉన్న రుణాలను పావలా వడ్డీకే వైఎస్ తీసుకొస్తే.. ఆ పథకం తర్వాత సున్నా వడ్డీగా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయతో, అందరి చల్లని దీవెనలతో వైయస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభించినట్టు జగన్ చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, రావాల్సిన ఆదాయం రాని పరిస్థితులు ఉన్నా.. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కచెల్లెమ్మలకు ఈ పథకం తీసుకురావడం వల్ల కాస్తో కూస్తో మేలు జరుగుతుందని అనుకుంటున్నామని చెప్పారు.
ప్రతి గ్రూపునకు కనీసం రూ.20వేల నుంచి రూ.40వేల వరకూ మేలు:
ఈ పథకం ద్వారా 8లక్షల 78వేల గ్రూపుల్లోని 91 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుందన్నారు సీఎం జగన్. ప్రతి గ్రూపునకు కనీసం రూ.20వేల నుంచి రూ.40వేల వరకూ మేలు జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3లక్షల పరిమితి వరకూ ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నారని చెప్పారు. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారని చెప్పారు. సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7శాతం నుంచి 13 శాతం వరకూ ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి గ్రూపునకూ 7శాతం వడ్డీ నుంచి 13.5శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలన్నారు. సగటున ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకూ లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల పొదుపు సంఘాలకు మరింత మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్టు సీఎం చెప్పారు. మనం చేసే ప్రతి పథకంలోనూ అక్కచెల్లెమ్మలకే పెద్దపీటే వేశామని సీఎం జగన్ అన్నారు. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
* 82 లక్షలమంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మ ఒడి పథకం
* పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు-నేడు కింద స్కూళ్లలో కార్యక్రమాలు
* కరోనా లేకపోతే.. అక్షరాల 27 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి
* అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టినరోజున జులై 8న
ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం
* జులై 8న ఈ 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం
* ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాదు, ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం
* నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవులు 50శాతం అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని గొప్ప చట్టం తీసుకు వచ్చాం
* వక్ర బుద్ధితో అక్క చెల్లెమ్మల వైపు చూస్తే.. కఠినంగా శిక్షలు వేసేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం
* త్వరలో రాష్ట్రపతిగారు దీనికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం
* 13 దిశ పోలీస్స్టేషన్లను, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకు వచ్చాం
* ప్రత్యేక యాప్కూడా కూడా తీసుకొచ్చాం
* ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీసును పెట్టాం
* 11వేలకుపైగా మహిళా పోలీసులను రిక్రూట్ చేసి ఉద్యోగాలు ఇవ్వగలిగాం
* గ్రామ సచివాలయాల్లో 7-8 మంది మహిళా మిత్రలను ఏర్పాట చేయడం జరిగింది
* బెల్టుషాపులు ఉన్నా, గృహహింస జరిగినా.. వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది
* వసతి దీవెన అని ఈ మధ్య కాలంలో 12 లక్షలమందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం
* డిగ్రీ, ఇంజినీరింగ్ లాంటి చదువులు చదివేవారికి రెండు దఫాల్లో వసతి దీవెన కింద తల్లుల అక్కౌంట్లో వేయగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం
* ఎప్పుడూ కనివినీ ఎరుగని విధంగా గత ప్రభుత్వం పెట్టిన మొత్తం ఫీజు రియంబర్స్మెంట్.. ఇవ్వడమే కాకుండా, ఈ మంగళవారం నాడు మార్చి 31 వరకూ ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లిస్తాం
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలలకు సంబంధించి పీజు రియింబర్స్మెంట్ను నేరుగా తల్లుల అక్కౌంట్లోకి వేస్తాం
* తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? కాలేజీల్లో మౌలికసదుపాయాలు ఎలా ఉన్నాయి? అని తల్లులు చూసుకుని ఆ ఫీజులు చెల్లిస్తారు
* జవాబుదారీ తనం కోసమే ఇలా చేస్తున్నాం