AP-Telangana : ఏపీ, తెలంగాణ వివాదాల పరిష్కారంపై కమిటీ భేటీ.. కుదరని ఏకాభిప్రాయం
విద్యుత్ బకాయిల వివాదంపై తెలంగాణ నుంచి తమకు 3వేల 442కోట్లు రావాల్సి ఉందని ఏపీ వాదించింది. అయితే తమకే విద్యుత్ బకాయిల రూపంలో రూ. 12వేల 532 కోట్లు రావాలని తెలంగాణ వాదించింది.

Ap Ts Disputes
AP and Telangana disputes : ఏపీ, తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారానికి ఏర్పడిన త్రిసభ్య కమిటీ తొలి సమావేశంలో పూర్తిస్థాయిలో ఫలితం తేలలేదు. కొన్ని అంశాలపై ఇంకా పీటముడి వీడలేదు. ఏపీ, తెలంగాణ అధికారులు ఎవరి వాదన వారు వినిపించారు. విద్యుత్ బకాయిల వివాదంపై తెలంగాణ నుంచి తమకు 3వేల 442కోట్లు రావాల్సి ఉందని ఏపీ వాదించింది. అయితే తమకే విద్యుత్ బకాయిల రూపంలో రూ. 12వేల 532 కోట్లు రావాలని తెలంగాణ వాదించింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ విషయంలో మాత్రం వివాదం ముగియలేదు. తెలంగాణ సభ్యులు లేకపోవడంతో ఏకపక్షంగా APSFC డీమెర్జర్కు కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని తెలంగాణ వాదించింది. దీంతోపాటు ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లడంతో 235.4 ఎకరాలపై వివాదం నడుస్తోంది.
నానక్రామ్ గూడలోని భవనం ఎవరికి చెందాలన్నది కూడా తేలలేదు. ఏపీ ప్రభుత్వం కేసులు వెనక్కి తీసుకోనంతవరకు ఈ వివాదంలో ముందుకు వెళ్లలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. బ్యాంక్ డిపాజిట్లు, అకౌంట్లలో నిధుల విభజనకు సంబంధించిన కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చినా మరికొన్నింటిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఉమ్మడిగా వినియోగించుకున్న ప్రభుత్వ సంస్థల నిర్వహణకైన ఖర్చులను రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. అయితే కేంద్ర పథకాలకు సంబంధించి ఏపీ నుంచి ఏడేళ్లుగా 495.21 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని తెలంగాణ తెలిపింది. అయితే హైకోర్టు, రాజ్భవన్ నిర్వహణకు అయిన ఖర్చు రూ.315.76 కోట్లు చెల్లిస్తామని ఏపీ హామీ ఇచ్చింది.