బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను గుర్తుచేస్తూ గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్

కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు.

బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను గుర్తుచేస్తూ గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్

ఏపీ ఓటర్లు ఎన్నికల్లో అద్భుత తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేశారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. లేదంటే బంగ్లాదేశ్, శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు చూశామో ఏపీలోన ఎన్నికలు ఆలస్యమైతే అదే పరిస్థితి చూసే వాళ్లమని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు.

తాము సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, ఈ రెండు రాష్ట్రానికి ప్రధాన ప్రాజెక్టులని చెప్పారు. పోలవరం విషయంలో విదేశీ నిపుణులు తో సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీద 7 శ్వేతపత్రాలు ఇచ్చామని, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుపుతున్నామని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల శాసన సభ్యుడు మాత్రమేనని, మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతి పక్ష నేత హోదా ఉంటుందని అన్నారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలో కూటమి పదికి పది గెలవడం హర్షనీయమని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

భారీ మెజారిటీతో స్థాయి సంఘం గెలిచామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఏ ఎన్నిక అయినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని చెప్పారు. వైసీపీ మునిగిపోయే నావ అని అన్నారు. ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, తాడేపల్లిలో జగన్ నైతికత, విలువలు అంటూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్టు ఉందని చెప్పారు.

వైసీపీకి మెజార్టీ ఉంటే ఎన్నికకు ఎలా వెళ్తారని కూటమిపై విమర్శలు చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎలా బెదిరించి గెలిచారో అందరికి తెలుసని చెప్పారు. ఏపీ ఓటర్లు ఎన్నికల్లో అద్భుత తీర్పు ఇచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేలా చేశారని అన్నారు.

Also Read: భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వందలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు