JC Prabhakar Reddy: సీమ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు తెరతీసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇంతకు ఆయన దీక్ష ఎందుకు?

ఆ మధ్య సంచలన స్టేట్‌మెంట్‌తో వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తాడిపత్రిలో ఎవరు లిక్కర్ షాపులు దక్కించుకున్నా 15శాతం కమీషన్ ఇవ్వాల్సిందే అన్నారు. JC Prabhakar Reddy

JC Prabhakar Reddy: సీమ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు తెరతీసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇంతకు ఆయన దీక్ష ఎందుకు?

JC Prabhakar Reddy Representative Image (Image Credit To Original Source)

Updated On : January 2, 2026 / 9:19 PM IST

 

  • రాయలసీమ రాజకీయాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి రూటే సెపరేటు
  • సాయం చేయడంలో ముందే..రచ్చకు కూడా వెనకాడని నేత
  • ఎప్పుడూ ఏదో ఒక స్టేట్‌మెంట్‌తో వార్తల్లో నిలుస్తున్న లీడర్
  • లేటెస్ట్‌గా తన ప్రవర్తనపై తానే దీక్షకు దిగిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
  • లాస్ట్ థర్టీ ఫస్ట్‌కు ఓ రచ్చ.. ఈసారి న్యూఇయర్‌ రోజు దీక్ష

 

JC Prabhakar Reddy: సీమలో ఆ లీడర్ రూటే సెపరేటు. అపోజిషన్‌ అయినా..పవర్‌లో ఉన్నా..మనసులో ఏముందో అదే మాట్లాడటం ఆయన స్టైల్. కాంట్రవర్సీ అవుతుందా..కలిసి వస్తుందా అనే దానికంటే ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటమే ఆయన నైజం. ఓ రకంగా ఆయనకు బోలా మనిషని కూడా పేరు. సాయం చేయడంలో ముందుంటారు. అవసరమైతే ధమ్కీ ఇచ్చేందుకు కూడా వెనకాడరు. లేటెస్ట్‌గా దీక్ష పేరుతో చర్చకు తెరదీశారాయన. తన ప్రవర్తన మీద తానే దీక్షకు కూర్చున్నారు. కొడుకు ఎమ్మెల్యే..ఆయన మున్సిపల్ ఛైర్మన్..ఇంతకు ఆయన దీక్ష ఎందుకు?

జేసీ. ఈ టైటిలే ఓ సంచలనం. జేసీ దివాకర్‌ రెడ్డి అయినా.. ప్రభాకర్‌ రెడ్డి అయినా.. ఏపీలో ఈ ఇద్దరి పాలిటిక్స్‌ స్టైలే వేరు. జేసీ దివాకర్‌రెడ్డి అయితే కొన్నాళ్లుగా పొలిటికల్‌గా యాక్టీవ్‌గా ఉండటం లేదు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాత్రం ఇప్పటికీ లైమ్‌లైట్‌లో ఉంటున్నారు. ఏ విషయంలోనైనా తగ్గేదేలే అంటుంటారు. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉన్న ప్రభాకర్‌ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.

మనసులో ఏముంటుందో బయటికి అదే మాట్లాడటం నైజం..

సార్ ఏం చేసినా స్పెషలే. ఓ మున్సిపల్ ఆఫీసర్‌ను తిట్టినా..కేతిరెడ్డి పెద్దారెడ్డితో గొడవకు దిగినా..పేదలకు సాయం చేయడంలో అయినా..తన బిజినెస్‌ల వ్యవహారంలోనైనా..ఆయనదంతా ఓపెన్. మనసులో ఏముంటుందో బయటికి అదే మాట్లాడటం జేసీ ప్రభాకర్‌రెడ్డి నైజం. టాపిక్ ఏదైనా సరే.. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డికి అధికార, ప్రతిపక్షం అన్న తేడా ఉండదు. తాను ఏదనుకుంటే అదే చేసి తీరుతారు. ఇప్పుడు తన కొడుకు ఎమ్మెల్యేగా ఉన్న తాడిపత్రిలో ఆయన మున్సిపల్ ఛైర్మన్‌ పోస్ట్‌లో ఉండి కూడా దీక్షకు దిగడం ఆసక్తికరంగా మారింది.

న్యూఇయర్ వేళ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్షకు దిగారు. గాంధీ బొమ్మ సెంటర్‌లో టెంట్ వేసుకుని దీక్షకు కూర్చున్నారు. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే తాడిపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయాలనే దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల అభిప్రాయం ప్రకారం తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క చెప్తా..

2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా తాను ఎన్ని నిధులు ఖర్చు చేశాను, ఏయే అభివృద్ధి పనులకు ఎంత కేటాయించాను అనే దానిపై ఫెక్సీలు వేసి మరీ వివరించారు. ప్రజలకు ఏమైనా డౌట్స్ ఉంటే తనను నేరుగా సంప్రదించేందుకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటా.. వారు అడిగే ప్రతి రూపాయికి లెక్క చెప్తా అంటున్నారు.

ఏదైనా జేసీ ప్రభాకర్‌రెడ్డి తన ప్రవర్తన మీద తాను దీక్షకు కూర్చొని..పద్దతి మార్చుకునేందుకు కూడా రెడీగా ఉన్నానని చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్‌ రాత్రి JC పార్క్‌లో ఏర్పాటు చేసిన వేడుకలపై BJP మహిళా నేతలు మాధవీలత, సాదినేని యామిని చేసిన విమర్శలపై నోరు జారి తర్వాత సారీ చెప్పారు జేసీ. ఈ సారి న్యూఇయర్ రోజు దీక్ష చేసి చర్చకు దారితీశారు.

15శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్..

ఆ మధ్య సంచలన స్టేట్‌మెంట్‌తో వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తాడిపత్రిలో ఎవరు లిక్కర్ షాపులు దక్కించుకున్నా నియోజకవర్గ అభివృద్ధికి 15శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ ఓపెన్ స్టేట్‌మెంట్‌ ఇచ్చి చర్చకు దారితీశారు. కమీషన్ ఇచ్చిన వారినే షాపులు నిర్వహించుకోనిస్తామంటూ వార్నింగ్ ఇచ్చేశారు. ఇసుక వ్యాపారం, క్లబ్స్‌ నడిపే వారు 15 శాతం నియోజకవర్గం కోసం కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ రూల్ పెట్టి న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారారు.

నియోజకవర్గ అభివృద్ది కోసమే కమీషన్‌ అడుగుతున్నానని జేసీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దందాలు చేసే వారి నుంచి కమీషన్లు వసూలు చేసి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారా అంటూ ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. ఇక అటు కేతిరెడ్డి పెద్దారెడ్డితో వైరం విషయంలో కూడా.. ఏడు పదుల వయసులో ఏ మాత్రం తగ్గడం లేదు జేసీ ప్రభాకర్‌రెడ్డి. లేటెస్ట్‌గా దీక్షకు కూర్చొని తన ప్రవర్తనపై ప్రజ‌ల అభిప్రాయాలు తెలుసుకుని, ప్రవ‌ర్తన మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం ఆసక్తికరంగా మారింది. జేసీ ప్రభాకర్‌రెడ్డిలో వచ్చిన మార్పు మంచిదే అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు చురకలు అంటిస్తున్నారు.

Also Read: వైసీపీలో వర్గపోరు..! ఇప్పటి నుంచే టికెట్ ఫైట్..? జగన్ ఎలా చెక్ పెట్టబోతున్నారు