పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ.. సభలో నవ్వులేనవ్వులు

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెనుమాక గ్రామంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిమధ్య జరిగిన సభాషణ...

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ.. సభలో నవ్వులేనవ్వులు

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. తొలుత బానావత్ పాములు నాయక్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడు.. వారికి పింఛన్ అందజేశారు. సుమారు అర్ధగంటపాటు వారి పూరిగుడిసెలోనే ఉండి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి ఇంటి స్థితిగతులుచూసి చంద్ర‌బాబు చలించిపోయారు. ప్రభుత్వం తరఫున ఇల్లు క‌ట్టించే చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్ర‌బాబు ఆదేశించారు.

Also Read : అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

పింఛన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక ప్రజలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాలోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రిని చూశాం.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూశామని నారా లోకేశ్ అన్నారు. ఇదే క్రమంలో అధికారులు ఇంకా పరదాలు కడుతున్నారు సర్.. వాళ్లు సెట్ అయ్యేసరికి ఇంకా సమయం పడుతుందని అనుకుంటా సర్ అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ లోకేశ్ వ్యాఖ్యానించారు. వెంటనే చంద్రబాబు కల్పించుకొని లేదు సెట్ అయ్యారు అంటూ సమాధానం ఇచ్చారు. ఇంకా పరదాలు కడుతున్నారు సర్ అని లోకేశ్ మరోసారి అనడంతో.. చంద్రబాబు నవ్వుతూ.. పరదాలు కట్టినట్లు ఇంకోసారి తమ దృష్టివస్తే వారిని సస్పెండ్ చేయడం తప్ప మరోమార్గం లేదని అన్నారు. ఎవ్వరైనా సరే పాతరోజులు మరిచిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకొని ముందుకు పోవాలని అందరిని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.

Also Read : మేము ఇచ్చిన మొదటి హామీని నేరవేరుస్తున్నాం: అచ్చెన్నాయుడు

మంత్రి లోకేశ్ కలుగుజేసుకొని.. ఐదు సంవత్సరాలు అలవాటుపడ్డారు సర్.. కొంచెం వాళ్లకు టైం పడుతుందని అనుకుంటా సర్ అని అన్నారు.. చంద్రబాబు స్పందిస్తూ.. వాళ్లకే కాదు.. మీకు కూడా అలవాటు కావాలి.. రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంక స్పీడ్ పెంచడం తప్ప ఎవరికి వెనక్కుపోయే ఆలోచన రాకూడదు.. అలావస్తే నేను షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా.. 1995 సమయంలో సీఎంను మరోసారి చూస్తారు. అప్పటి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి.. అప్పుడు నువ్వుకూడా (లోకేశ్ ను ఉద్దేశిస్తూ) కుర్రాడివి.. నీకు కూడా గుర్తులేదు అంటూ చంద్రబాబు సరదాగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ మధ్య జరిగిన సభాషణలతో సభలో నవ్వులు విరబూశాయి.