నేను కాదు.. మొత్తం చేసింది వైసీపీ లీడర్ జోగి రమేశే..: నకిలీ మద్యం నిందితుడు సంచలనం

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేశ్ తనకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని తెలిపారు.

నేను కాదు.. మొత్తం చేసింది వైసీపీ లీడర్ జోగి రమేశే..: నకిలీ మద్యం నిందితుడు సంచలనం

Updated On : October 13, 2025 / 6:53 PM IST

Janardhan Rao: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. వైసీపీ పాలనలో జోగి రమేశ్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేశ్ తనకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేశ్ తనతో అన్నారని చెప్పారు. (Janardhan Rao)

“పై వారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడు అయిన నీకు ఈ పని అప్పజెప్పుతున్నానని అన్నారు. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేశ్ నాతో అన్నారు. ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నా కానీ జోగి రమేశ్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో లిక్కర్ షాపులు నేను తీసుకున్నా. తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని, అది అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేశ్ అన్నారు.

వేరే వాళ్ల పేరు మీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకొచ్చాం. లిక్కర్ తయారీ చెయ్యండని, మంచి సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేశ్ నాతో అన్నారు.

నాకు ఉన్న ఆర్థి క ఇబ్బందుల నుంచి బయటపడటానికి సహాయం చేస్తామని జోగి రమేశ్ హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యిన తరువాత నన్ను ఆఫ్రికాలో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు పంపారు. జోగి రమేశ్ తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్ కు లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశారు” అని తెలిపారు.

చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు..

చంద్రబాబు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారని జనార్దన్ రావు అన్నారు. “మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం.. సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేశ్ అన్నారు. ఇబ్రహీంపట్నం గోడౌన్‌లో ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టాలని జోగి రమేశ్ చెప్పారు. జోగి రమేశ్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు.

చివరకు అనుకున్నది అంతా జరిగిందని, చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, ఇక నేను రావాల్సిన అవసరం లేదని జోగి రమేశ్ అన్నారు. అంతా తాను చూసుకుంటానని, బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి జోగి రమేశ్ హ్యాండ్ ఇచ్చారు. నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేశ్ ఇరికించారు. నీ ఫ్రెండ్ జై చంద్రారెడ్డి ఎలాగో ఆఫ్రికా వ్యాపారాలు చేసుకుంటున్నాడు..

అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదు అని జోగి రమేశ్ నన్ను నమ్మించారు. జోగి రమేశ్తో నాకు చిన్నప్పటినుంచి పరిచయం ఉంది. నన్ను నమ్మించి జోగి రమేశ్ మోసం చెయ్యడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా” అని సంచలన విషయాలు బయటపెట్టారు జనార్దన్ రావు.

దూకుడు పెంచిన అధికారులు

నకిలీ మద్యం కేసులో అధికారులు దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో ఎక్సైజ్ శాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఏ1 జనార్దన్‌ రావు సన్నిహితులపై ఎక్సైజ్‌ శాఖ ఫోకస్‌ పెట్టింది. హైదరాబాద్‌ సహా విజయవాడలో ఉన్న జనార్దన్‌ స్నేహితుల ఇళ్లలో ఎక్సైజ్‌ అధికారుల సోదాలు జరుపుతోంది. జనార్దన్‌ రావు వ్యాపార భాగస్వాముల నుంచి కూడా కీలక వివరాలు సేకరిస్తున్నారు.