Atchannaidu: అందుకే క్యాబినెట్ భేటీలో పవన్ కల్యాణ్ బాధపడ్డారు: మంత్రి అచ్చెన్నాయుడు
అప్పట్లో పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా ఆయన వదల్లేదని అచ్చెన్నాయుడు చెప్పారు.

Kinjarapu Atchannaidu (Photo : Google)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కుటుంబంపై కొందరు ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ తన ఆడపిల్లలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని క్యాబినెట్ భేటిలో బాధపడ్డారని అచ్చెన్నాయుడు తెలిపారు. దొంగే దొంగ అన్నట్లుగా జగన్ గొంతు చించుకుని అరుస్తున్నారని చెప్పారు. జగన్ మతి ఉండే మాట్లాడుతున్నారా అని నిలదీశారు.
అప్పట్లో పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా ఆయన వదల్లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇవాళ భావప్రకటనా స్వేచ్ఛ గుర్తొచ్చిందా అని అడిగారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఆడపిల్లలపై ఇష్టానుసారంగా కేసులు పెడతారా అని నిలదీశారు.
సొంత తల్లి, చెల్లి మీద సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తున్నానని, ఎవరిపైనైనా అసహ్యకర పోస్టులు పెడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు కోట్ల మందికి స్వాతంత్ర్యము వచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు. గత ఐదేళ్లు వైసీపీ సర్కారు ఎవరిని వదలకుండా, కేసులు పెట్టిందని, ఆస్తుల ద్వంసం చేసి పైశాచిక ఆనందం పొందిందదని చెప్పారు. తమ ప్రభుత్వంపై కూడా ప్రజల నుంచి అదే ఒత్తిడి ఉందని, కానీ, తమ నేత చంద్రబాబు కక్ష సాధింపునకు దూరమని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నామని తెలిపారు. తప్పు చేసిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.