Krishna water dispute: మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన కృష్ణా నీటి పంపకాల పంచాయితీ..
ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు ప్రస్తావించింది.

Supreme Court
కృష్ణా నీటి పంపకాల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. కృష్ణా ట్రైబ్యునల్ నీటి పంపకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. ట్రైబ్యునల్ ముందు దాఖలైన రెండు రిఫరెన్స్ల విచారణ వ్యవహారంపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023, అక్టోబర్ 23న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్పై ఇటీవల బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని తెలిపిన విషయం తెలిసిందే.
విభజన చట్టం ప్రకారం నీటి వాటాల పంపకంపై రెండు రిఫరెన్స్లను ఇరు రాష్ట్రాలు ట్రైబ్యునల్లో దాఖలు చేశాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు చేస్తూ ఇప్పటికే బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన కృష్ణా నదీ నీటి పంపకాలపై తెలంగాణ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది.
కృష్ణానది తమ భూభాగంలోనే ఎక్కువ ప్రవహిస్తుండడంతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు 70 శాతం నీటి వాటా ఉండాలని లేదంటే ఇరు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ కోరింది. అయితే, ఈ వ్యవహారంపై ట్రైబ్యునల్ తేల్చక ముందే 2023 అక్టోబర్ 10న కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్యనే నీటి పంపకాలను తేల్చాలని, దానిపైనే విచారణ చేపట్టాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. తమ ముందు ఉన్న రెండు రిఫరెన్స్లలో 2023లో కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రిఫరెన్స్ పైనే ముందుగా విచారణ చేపడుతామని ఈనెల 16న కృష్ణా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు ప్రస్తావించింది.
వచ్చేనెల 19న ట్రైబ్యునల్ రెండో రిఫరెన్స్నే విచారణకు తీసుకుంటామని చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి, తమ పిటిషన్పై త్వరగా విచారణ చేపట్టాలని ఏపీ న్యాయవాదులు కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తావనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణను వచ్చేనెల 13న మధ్యాహ్నం 2గంటలకు చేపడతామని చెప్పింది.