Weather Update : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరోవైపు తీవ్ర వడగాల్పులు.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
Weather Update : బలమైన వేడి గాలులు కారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Weather Update
- ఏపీలో భిన్నవాతావరణం
- నేడు ఉత్తరాంధ్రలో వడగాలులు
- పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం
- ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్
Weather Update : ఏపీలో విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపుతుండగా.. సాయంత్రం సమయంలో ఈదరుగాలులు, ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉదయం 10గంటల దాటితే ఎండ తీవ్రతకు బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మరోవైపు మధ్యాహ్నం వేళ ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Also Read : Gold Rate Today : కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఊహించని స్థాయిలో తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలకు కీలక సూచనలు చేసింది. సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (శుక్రవారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అదేసమయంలో ద్రోణి ప్రభావం కారణంగా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవాళ (శుక్రవారం) విజయనగరం జిల్లా బోడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవల్స, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాలు.. పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
బలమైన వేడి గాలులు కారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు.. శనివారం 54 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
