AP Cabinet Decisions: రేపే.. రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు.. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు 32 ఎకరాలు- మంత్రి పార్థసారథి
ఎయిర్ పోర్టులను లీజుకు ఇవ్వడం ద్వారా, పీపీపీ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా అప్పులు చెల్లించాలని నిర్ణయం.

AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారుల భవనాలను సత్వరం పూర్తి చేయాలని కేబినెట్ తీర్మానించిందన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్ ల నివాస భవనాల పూర్తి కోసం నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. భవనాలు, మిగిలిన పనుల పూర్తి కోసం 524.7 కోట్లు నిధుల మంజూరుకు పరిపాలన పరమైన ఆమోదం ఇచ్చినట్లు వెల్లడించారు. అమరావతిలో 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 33.49 ఎకరాల భూముల కేటాయింపునకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు 32.4 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.
* గెయిల్, అంబికా సంస్థలకు అమరావతిలో కేటాయించిన భూమిని రద్దు చేస్తూ ప్రతిపాదనకు ఆమోదం
* కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ ముందు ఇసుక క్వారియింగ్ కోసం 250.2 కోట్ల పరిపాలన ఆమోదం
* ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి క్వారీయింగ్ ను సీఆర్డీఎ నిర్వహణకు కేబినెట్ ఆమోదం
* జలవనరుల శాఖలో గత ప్రభుత్వం పక్కన పెట్టిన 71 పనులు చేసేందుకు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
* కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో విమానాశ్రయాల అభివృద్ధికి వెయ్యు కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆమోదం
* ఎయిర్ పోర్టులను లీజుకు ఇవ్వడం ద్వారా, పీపీపీ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా అప్పులు చెల్లించాలని నిర్ణయం
* హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదం
* రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం
* జలజీవన్ మిషన్ కింద 10 వేల కోట్ల రుణం ద్వారా నిధుల సమీకరించే ప్రతిపాదనకు ఆమోదం
* సరకు రవాణా వాహనాలపై గత వైసీపీ ప్రభుత్వం 20వేల వరకు పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను తగ్గిస్తూ మంత్రి వర్గం ఆమోదం
* గ్రీన్ టాక్స్ ను 1500-3000 వరకు తగ్గిస్తూ రవాణశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
* అమరావతి క్వాంటం వ్యాలీ కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదకు మంత్రి మండలి ఆమోదం
Also Read: వైసీపీపై సీఎం చంద్రబాబు సీరియస్, కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటన..
* రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీ అభివృద్ది కోసం ప్రకటించిన పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
* రామాయపట్నంలో భూసేకరణ కోసం 5 టీంలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం
* రాజధాని అమరావతిలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 1575 పింఛన్లను పునరుద్దరించిన మంత్రివర్గం
* మార్క్ ఫెడ్ తీసుకున్న 6700 కోట్లు రుణానికి అదనంగా 1000 కోట్లు రుణం పొందేందుకు ఆమోదం
* 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం
* కిలోకు 4 రూపాయల చొప్పున 260 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రతిపాదకు మంత్రివర్గం ఆమోదం
* రైతులకు ధాన్యం సేకరణ డబ్బు చెల్లించేందుకు 672 కోట్ల విడుదలకు మంత్ర వర్గం ఆమోదం
* రేపు రైతుల ఖాతాలో ధాన్యం కొనుగోలు డబ్బు జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
* రెండో విడత భూ సమీకరణ పై ప్రజలతో ఎక్కువగా సంప్రదించాలని కేబినెట్ లో నిర్ణయించారు
* భూ సమీకరణకు అవసరాన్ని, పరిస్ధితిని రైతులకు తెలియజేయాలని నిర్ణయం
* రైతుల అనుమానాలు నివృత్తి చేసి ఒప్పుకున్నాకే భూ సమీకరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
”రాష్ట్రంలో విధ్వంసం, గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. పెట్టుబడులు రాకుండా చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు, శోచనీయం. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రముఖ సంస్థలకు వైసీపీ నేతలు మెయిల్స్ పెట్టారు. సీపీకి చెందిన ఉదయ భాస్కర్ పెట్టుబడులు పెట్టొద్దని ఈ మెయిల్స్ పంపడం దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రతిపక్ష పార్టీ దిగజారుడుతనానికి ఈ తరహా చర్యలు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధిని, పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది.
ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పారిశ్రామిక అభివృద్ధి ఆగదు. రాష్ట్రం అభివృద్ది చెందకుండా ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు తిప్పి కొట్టాల్సిన బాధ్యత మంత్రులుగా మాపై ఉంది. ప్రతిపక్షం చేసే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని సీఎం చెప్పారు. కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు” అని మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు.