వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన నారా భువనేశ్వరి
మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని నారా భువనేశ్వరి అన్నారు.

Nara Bhuvaneshwari
Nara Bhuvaneswari: కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కోవూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే, వైసీపీ నేత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు.
మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ఆమె అన్నారు. మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి నా సంఘీభావం ప్రకటిస్తున్నా. ఆమెపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళల పట్ల అవమానకరమైన పదాలు వారి విలువను తగ్గించలేవు. స్ఫూర్తిని విఛ్చిన్నం చేయలేవు. మన సంస్కృతి విలువలు మహిళల పట్ల గౌరవాన్ని నిలబెట్టాయి. దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ ఖండించాలి. మహిళల వ్యతిరేక మనస్తత్వాన్ని ఖండిస్తూ.. ప్రతి స్త్రీ గౌరవానికి గట్టిగా మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామని నారా భువనేశ్వరి అన్నారు.