Kurnool: ఏపీలో దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి ప్రాణాలతో చెలగాటమాడిన డాక్టర్లు
పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని వెంటిలేటర్లపై ఉంచారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో అతడు చనిపోయాడంటూ డాక్టర్లు వెంటిలేటర్లు తొలగించారు.

Kurnool
Kurnool – Government hospital: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ రోగి ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఎమ్మిగనూరు మండలం ముగుతి గ్రామానికి చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తి బాత్రూంలో జారిపడి, తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.
పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని వెంటిలేటర్లపై ఉంచారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో అతడు చనిపోయాడంటూ డాక్టర్లు వెంటిలేటర్లు తొలగించారు. అతడిని మార్చురీకి తరలించే సమయంలో పెద్ద డాక్టర్ వచ్చారు. పల్స్ చూసి, బతికే ఉన్నాడని నిర్ధారించారు. ఈ విషయాన్ని రోగి కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పి కన్నీరు పెట్టుకున్నారు.
రోగికి ఇప్పుడు మళ్లీ చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ల తీరుతో రోగి ఆసుపత్రిలో నరకం అనుభవించాడని అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి ఉన్నతాధికారులు కనీసం స్పందించారో లేదోనని రోగి కుటుంబ సభ్యులు అంటున్నారు.