గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేసింది: మంత్రి నిమ్మల
చంద్రబాబు నాయుడి పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

Minister Nimmala ramanaidu
గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేస్తే నేడు చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు పేదలకు వైద్య సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.8.20 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఇప్పుడు ఏపీలోని రైతులు తమ ధాన్యాన్ని వారికి నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటు ఉందని తెలిపారు.
అంతేగాక, 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నదాతలకు చెల్లించాల్సిన 1,674 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొట్టిందని తెలిపారు. అన్నదాతలను, వ్యవసాయాన్ని గాలికి వదిలేసి ధాన్యం సేకరించే సివిల్ సప్లై కార్పొరేషన్ ను సైతం తాకట్టు పెట్టారని చెప్పారు.