AP: ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్ తో వెంబడించి.. తొక్కించి హత్యచేసిన కొడుకు..
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో..

Vizianagaram district Tragic incident
AP News: ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో నవమాసాలు మోసి కనిపెంచిన కుమారుడే తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. భూమి పంపకాల విషయంలో కక్ష పెంచుకున్న కొడుకు.. తల్లిదండ్రులను ట్రాక్టర్ తో వెంబడించి, తొక్కించి దారుణంగా హత్యచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ‘బతికితే ఇండియాలో బతుకుతాం.. లేకపోతే చస్తాం.. అంతే కానీ పాక్ మాత్రం వెళ్లం’
చల్లవానితోట పంచాయతీ నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (45)కు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధాకుమారి ఉన్నారు. రాధాకుమారికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెండ్లి సమయంలో తమకున్న ఎకరా భూమిలో 20సెంట్లు ఆమెకు తల్లిదండ్రులు రాసిచ్చారు. అయితే, ఐదేళ్ల క్రితం రాధాకుమారి భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఆమె తన ఇంటివద్ద నివాసం ఉంటుంది. మిగిలిన ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులు, కుమారుడు రాజశేఖర్ మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, పంచాయతీ పెద్దలు కుటుంబ అప్పులను తీర్చడానికి 12సెంట్లు కేటాయించారు. మిగిలిన భూమిని తనపై రిజిస్ట్రేషన్ చేయించాలని కొడుకు పట్టుబడుతూ వచ్చాడు.
రాజశేఖర్ తీరు నచ్చని తల్లిదండ్రులు భూమిలో 30 సెంట్లను కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో తల్లిదండ్రులపై రాజశేఖర్ కక్ష పెంచుకున్నాడు. అయితే, శనివారం పొలంలో కొంతభాగాన్ని దున్నేందుకు రాజశేఖర్ ట్రాక్టర్ తో వెళ్లాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు అతన్ని అడ్డుకునేందుకు పొలంలోకి వెళ్లారు. అయితే, రాజశేఖర్ తన తల్లిదండ్రులపై ట్రాక్టర్ ను ఎక్కించే ప్రయత్నం చేశాడు. దీంతో భయంతో వారిద్దరు పక్కనే ఉన్న మొక్కజొన్న పొలంలో పరుగులు పెట్టారు. రాజశేఖర్ వదలకుండా మొక్కజొన్న పొలంలోకి ట్రాక్టర్ ను పోనిచ్చి సొంత తల్లిదండ్రులను ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు. అనంతరం అతని భార్యతో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.