లిక్కర్, స్యాండ్, మైనింగ్పై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు ఇలా అక్రమాల చిట్టా బయటికి వస్తుందా?
కాంట్రాక్టులకు బిల్లుల చెల్లింపు, డీబీటీ ట్రాన్స్ఫర్లు, ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా అన్ని వివరాలు బయటికి తీయాలనుకుంటోంది ప్రభుత్వం.

Chandrababu-Jagan
ఓవైపు పాలన..ఇంకోవైపు సంక్షేమం..మరోవైపు గత సర్కార్ హయాంలో అక్రమాల జరిగాయంటూ ఫోకస్. ఇలా కూటమి సర్కార్ సైలెంట్గా పనిచేసుకుంటూ పోతోంది. ఇప్పటికే వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు చేశారంటూ ఎంక్వైరీలు, దర్యాప్తులు చేస్తోంది కూటమి ప్రభుత్వం.
కొన్ని అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ, మరికొన్ని అంశాలపై సీఐడీ, ఇక మద్యం లాంటి పెద్ద కేసుల్లో సిట్ విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు లేటెస్ట్గా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీట్లో..గత సర్కార్ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తావించారు. అంతేకాదు వైసీపీ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ హయాంలో తీసుకున్న ప్రతీ నిర్ణయం మీద…అవకతవకలు, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇసుక విధానం మీద దర్యాప్తు చేస్తుంది. మైనింగ్ వ్యవహారాల మీద ఫోకస్ పెట్టింది. లిక్కర్ పాలసీపై అయితే సిట్ ఏర్పాటు చేసింది. ఇవే కాదు చాలా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జగనన్న కాలనీల కోసం సేకరించిన భూముల విషయంలోనూ అక్రమాలు జరిగాయంటోంది టీడీపీ. పలు కార్పొరేషన్ల నుంచి అడ్డగోలుగా డబ్బుల బదిలీ జరిగినట్లు ఆరోపిస్తోంది.
తప్పుడు రిపోర్టులు, రికార్డులు?
రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును వైసీపీ పార్టీ యాక్టివిటీ కోసం వాడుకున్నారని కూడా ప్రచారం ఉంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేలాది మందికి లక్షలాది రూపాయల చొప్పున జీతాలు చెల్లించారట. తప్పుడు రిపోర్టులు, రికార్డులతో కార్పొరేషన్ నుంచి జీతాలు స్వాహా చేసినట్లు టీడీపీ చెబుతోంది. అలా నాటి అక్రమ చెల్లింపుల వ్యవహారం మొత్తం బయటికి రావాలంటే బ్యాంకర్ల సహకారం అవసరమని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. ఏ కేసు విషయమైనా పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు అడిగిన వెంటనే బ్యాంకులు వివరాలు ఇస్తే అందరి లెక్కలు తీయొచ్చని భావిస్తున్నారట.
గత సర్కార్ హయాంలో జరిగిన పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ మీద కూటమి సర్కార్కు డౌట్స్ ఉన్నాయట. రాబడి ఒకలా ఉంటే..ఖర్చులు ఇంకోలా ఉన్నాయని..ఆ రెండింటి మధ్య పొంతన లేదని అంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు..ఖర్చుపెట్టిన నిధులు లెక్కలపై ఆరా తీస్తే చాలా గ్యాప్ ఉందట. ఈ వ్యవహారాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్నాయని అంటున్నారు. అప్పట్లో ప్రభుత్వ ఖజానా నుంచి అడ్డగోలుగా నిధులు డ్రా అయినట్లు గుర్తించారట. కానీ ప్రతీది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావడంతో ఆధారాలు దొరకడం లేదట. అందుకే బ్యాంకర్ల సాయం కోరుతున్నారట సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ ఆదాయ మార్గాలు..ఖర్చులు అన్నీ బ్యాంకుల ద్వారే జరుగుతాయి. అదే ఆసరాగా చేసుకుని లిక్కర్, స్యాండ్, ఇతర స్కీమ్ల ఇంప్లిమెంటేషన్లో నిధులు అడ్డగోలుగా స్వాహా చేశారని అనుమానిస్తోంది కూటమి సర్కార్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బ్యాంకు లావాదేవీలతో ముడిపడి ఉంది..కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల చిట్టాను ఆధారాలతో సహా బయటికి తీయడం ఇబ్బంది అవుతోందట.
డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరకడం లేదా?
కొన్ని వివరాలు బయటికి రావడంతో ఏదో ఇలఖత మాఫియా జరిగిందని క్లారిటీ వస్తున్నా.. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరకడం లేదట. అందుకే బ్యాంకర్ల సాయం తీసుకుంటే..నిధుల డ్రాకు సంతకాలు పెట్టిందెవరు.? మౌఖిక ఆదేశాలతోనే ఫండ్స్ రిలీజ్, డబ్బుల డ్రా జరిగిందా.? బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు చేరే డీబీటీలో కూడా ఏదైనా కథ ఉందా.? అని ఆరా తీస్తున్నారట.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. అయితే పారదర్శకత పేరుతో పైసలు స్వాహా చేశారని అంటోంది టీడీపీ. తెచ్చిన అప్పుల్లో మేజర్ షేర్..ప్రజలకే డైరెక్టుగా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. బ్యాంకర్లు ఫుల్ డిటేయిల్స్ ఇస్తే ఆ డీబీటీ వ్యవహారమేంటో కూడా తెలిసిపోతుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
కాంట్రాక్టులకు బిల్లుల చెల్లింపు, డీబీటీ ట్రాన్స్ఫర్లు, ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా అన్ని వివరాలు బయటికి తీయాలనుకుంటోంది ప్రభుత్వం. పలు అంశాలపై ఇప్పటికే కొనసాగుతోన్న దర్యాప్తునకు బ్యాంకర్లు సహకరిస్తే గత సర్కార్ హయాంలో జరిగిన అక్రమాల చిట్టా మొత్తం బయటికి వస్తుందంటున్నారు టీడీపీ నేతలు. బ్యాంకర్లు సమాచారం ఇస్తారా? వాళ్లిచ్చే డిటేయిల్స్తో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన గోల్మాల్ వ్యవహారం బయటికి వస్తుందా అనేది వేచి చూడాలి మరి.