విశాఖలో దారుణం, ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులు తట్టుకోలేక శానిటైజర్ తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యం వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బాకీ డబ్బుల కోసం ఈగల సత్యం వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యం అరాచకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై అతడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక వివాహిత శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి కొడుకు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పెదవాల్తేరు ప్రాంతంలో ఎస్తేరు రాణి అనే మహిళ రోడ్డు పక్కన హోటల్ నడుపుతుంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యం తరచూ బాధిత మహిళ హోటల్ కి వెళ్లేడమే కాకుండా.. అక్కడ హోటల్ కొనసాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని బెదిరించేవాడు. అంతేకాదు తనతో సన్నిహితంగా ఉండకపోతే లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టు ఎస్తేరు రాణి పై తప్పుడు కేసు పెడతానని బెదిరించేవాడట.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కూడా బాధితురాలిని తనతోనే ఉండాలని బెదిరించాడని సమాచారం. అంతేగాక నడి రోడ్డుపైనే విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ అవమానం తట్టుకోలేక బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు ఆమెను కేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఈగల సత్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.