Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబు నిరాహార దీక్ష.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు
Ambati Rambabu : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం ఉదయం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు.
YSRCP leader Ambati Rambabu
- వైసీపీ నేత అంబటి రాంబాబు నిరాహార దీక్ష
- తనను కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలి
- తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంబటి రాంబాబు
- సాయంత్రం 6గంటల వరకు కొనసాగనున్న నిరాహార దీక్ష
Ambati Rambabu : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం ఉదయం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6గంటల వరకు ఆయన దీక్షను కొనసాగించనున్నారు. దీక్షా శిబిరం వద్దకు వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి అంబటికి సంఘీభావం తెలుపుతున్నారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని, తన ఇల్లు, ఆఫీస్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంబటి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్ లోని అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో అంబటి రాంబాబు జనవరి 31న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. ఫిబ్రవరి 18వ తేదీన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
దీక్షా శిబిరం వద్ద అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని అంబటి డిమాడ్ చేశారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టను. చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడిచేసే సంస్కృతిని పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేశ్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంబటి అన్నారు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరని, టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బయపడరని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, నన్ను అరెస్టు చేసి హింసించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నేను చేస్తుంది ధర్మపోరాటమని చెప్పిన ఆయన.. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
