Peddireddy: అందుకు కిరణ్ కుమార్ రెడ్డే కారణం: మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబుతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమకు శత్రువేనని పెద్దిరెడ్డి చెప్పారు.

peddireddy ramachandrareddy
మాజీ సీఎం, రాజంపేట లోక్సభ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి మాట్లాడుతూ… కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని అన్నారు. వైఎస్ జగన్ను కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో వేధించారని, జైలుకు పంపారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు కూడా ఆయనే కారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు బీజేపీలో చేరారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి నీరు కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబుతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమకు శత్రువేనని పెద్దిరెడ్డి చెప్పారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో సీఎం అయ్యారని, కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలు చేసి సీఎం అయ్యారని చెప్పారు. మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దిరెడ్డి ప్రజలను కోరారు. తాజాగా, వైసీపీపై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Also Read: ఎక్కడ చదువుకుని వచ్చారంటూ.. అన్నామలై, కంగనా రనౌత్పై కేటీఆర్ సెటైర్లు