HMDA Allocations : హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనపై సర్కార్ ఫోకస్
HMDA Allocations : గ్రేటర్ మహానగరానికి దక్కిన కేటాయింపులను పరిశీలిస్తే... జీహెచ్ఎంసీకి 3వేల 65 కోట్లు, హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రా కోసం 265 కోట్లు, ట్యాక్స్ కాంపెన్సేషన్ కోసం 10 కోట్లు కేటాయించారు.
HMDA Allocations : ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీకి ఈ ఏడాది భారీ కేటాయింపులు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పటికే హైడ్రా పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి 200 కోట్లను కేటాయించింది. ఇక తాజాగా రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ కోసం భారీగా నిధులు వెచ్చించింది. మూసీ ప్రక్షాళన, వాటర్ బోర్డు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం పెద్ద మొత్తం నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీకి అన్ని విభాగాలకు కలిపి దాదాపు 10వేల కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారు.
గ్రేటర్ మహానగరానికి దక్కిన కేటాయింపులను పరిశీలిస్తే… జీహెచ్ఎంసీకి 3వేల 65 కోట్లు, హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రా కోసం 265 కోట్లు, ట్యాక్స్ కాంపెన్సేషన్ కోసం 10 కోట్లు కేటాయించారు. అలాగే HMWSSBకు 3 వేల 385 కోట్లు..
అందులో ఉచిత మంచి నీటి పథకం బిల్లుల రీయింబర్స్మెంట్కు రూ.300 కోట్ల రూపాయల గ్రాంటుగా పద్దులో పొందుపరిచారు. మైట్రో రైలుకు రుణాల కింద 500 కోట్లు… MGBS నుంచి ఫలక్నుమా వరకు ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి రూ.100 కోట్లు, హైదరాబాద్ ఎంఎంటీఎస్ కోసం 50 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఇక హైదరాబాద్ చుట్టూ 350 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రెండు భాగాలుగా ట్రిపుల్ఆర్ను చేపట్టేందుకు 26వేల 502 కోట్లను ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బడ్జెట్లో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ కోసం 15వందల 25 కోట్లుగా కేటాయించనున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్, ట్రిపుల్-ఆర్కు మధ్య వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వాడలు రావడంతోపాటు నిర్మాణ యాక్టివిటీ కూడా భారీగా పెరగనుంది.
ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్ల రూపాయాలను కేటాయించింది. ఈ విభాగం ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రభుత్వ భూముల రక్షణతో పాటు విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకోసం 15 వందల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. పర్యావరణానికి నష్టం లేకుండా రిక్రియేషన్ జోన్లు, వాకింగ్ ట్రాక్లు, పీపుల్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లను డెవలప్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
హెచ్ఎండీఏకు ఈ ఏడాది బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉండటంతో రియాల్టీ రంగం సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్లో మౌలిక సదుపాయలు పెరిగి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంస్థలు హైదరాబాద్కు వచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు. దీంతో నిర్మాణ రంగం కూడా భవిష్యత్లో మరింత వృద్ధిని సాధించనుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.
Read Also : ITR Filing : ఐటీఆర్ ఫైలింగ్.. ఈ ఏడాదిలో 5 కోట్లు దాటిన రిటర్నులు.. ఒకే రోజు 28 లక్షలు దాఖలు!