బైకు దొంగల ముఠా గుట్టరట్టు.. ఒకడ్ని పట్టుకుంటే 77 బైకులు దొరికాయి!

బైకు దొంగల ముఠా ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు.. ఒక్క దొంగను పట్టుకుంటే మిగిలినవారంతా పట్టుబడ్డారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన 77 బైకు దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. దొంగల ముఠా చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 15 మంది దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలించారు.
ప్రధాన నిందితులు మొహసీన్, అమీనుల్లా, అక్బర్ గ్యాంగ్లకు చెందిన వారిగా గుర్తించామని పోలీసులు వివరాలను తెలిపారు. కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో టీవీఎస్ స్పోర్ట్స్ బైకు చోరీ చేసిన ముషీరాబాద్కు చెందిన ఆదిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మోహసిన్ అనే మరో బైకుల దొంగతో కలిసి ఆదిల్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
మోహసీన్ వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు బైకు దొంగతనాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 31 అరెస్టు అయ్యాడు. మే 21న జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన వెంటనే తన గ్యాంగులోని ఐదుగురు అనుచరులు షోయెబ్, సైఫ్, హఫీజ్, ఫైజాన్, సుభాన్లతో కలిసి 15 దొంగతనాలు చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. చోరీ చేసిన వాహనాన్ని మైలార్దేవ్పల్లికి చెందిన అబ్దుల్లాకు విక్రయించినట్లు మొహసీన్ తెలిపాడు. వాహనంతో పాటు అబ్దుల్లా నుంచి మరో నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్కు చెందిన అక్బర్కు ఓ చోరీ వాహనాన్ని తరలించారు. అక్బర్, అస్గర్, మన్నన్ల పేరిట పలు వాహనాలను నిజాబాబాద్కు తరలించినట్లు తేలింది. 15రోజుల వ్యవధిలోనే అక్బర్కు పలు వాహనాలు అప్పగించినట్లు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. అబూద్, యాసర్ అరాఫత్ అలియాస్ అప్పూ, అబ్దుల్లా, ఫరూఖ్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.
అమీనుల్లా, మొహసీన్ గ్యాంగుల ద్వారా పలు వాహనాలను కొనుగోలు చేశారని చెప్పారు. మొత్తంగా 77 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొహసీన్, అమీనుల్లా గ్యాంగ్లకు చెందిన వ్యక్తులు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఎన్ఫీల్డ్, కేటీఎం వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో గుర్తించిన వాహనాల హ్యాండిల్ లాక్లను తొలగిస్తారు.
ఇగ్నిషన్ కేబుల్స్ను తొలగించి, డైరెక్ట్ కనెక్షన్ ద్వారా వాహనాలు స్టార్ట్ అయ్యేలా చేస్తారు. వాహనాలు చోరీ చేసి తీసుకొచ్చిన వారికి గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే ఇస్తుంటారు.. అక్బర్, అస్గర్ గ్యాంగుకు చెందిన వ్యక్తులు ఖరీదైన వాహనాలను ఫైనాన్స్ సంస్థల ద్వారా కొనుగోలు చేసి కావాలనే ఫైనాన్స్ కట్టరు. ఆ వాహనాలను హిందుస్తాన్ పార్సిల్ సర్వీసెస్ ద్వారా నిజామాబాద్కు తరలించేవారు. అక్కడ వీటికి సంబంధించి పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారు. పోలీసులు చాకచక్యంగా బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన నార్త్జోన్ పోలీసులకు సీసీ అంజనీకుమార్ ప్రశంసించారు.