ATM Cash Theft : ఏటీఎంలలో డబ్బు డిపాజిట్ చేస్తూ చేతివాటం చూపిన వ్యక్తి అరెస్ట్
ఏటీఎంలలో డబ్బులు పెట్టే క్రమంలో ఏజెన్సీకి తెలియకుండా స్లిప్పులు మార్చి రూ.5 లక్షలు దొంగిలించిన వ్యక్తిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ATM Cash theft
ATM Cash Theft : ఏటీఎంలలో డబ్బులు పెట్టే క్రమంలో ఏజెన్సీకి తెలియకుండా స్లిప్పులు మార్చి రూ.5 లక్షలు దొంగిలించిన వ్యక్తిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బోయినపల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…స్టేషన్ ఘనపూర్కు చెందిన చోక్కం కృష్ణ ప్రసాద్(30 )బీటెక్ చదువును మధ్యలోనే ఆపేసి హైదరాబాద్కు వచ్చి ఎస్.ఆర్.నగర్లో ఉంటూ సికింద్రాబాద్లోని డైమండ్ పాయింట్లోని నికల్సన్ రోడ్లో గల సీఎంఎస్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఆ ఏజెన్సీ ద్వారా నగరంలోని ఏటీఎంలలో క్యాష్ను నింపుతుంటాడు.
ఈ క్రమంలో జూన్6 న ఎప్పటిలాగే సికింద్రాబాద్లోని వివిధ ఏటీఎంలలో క్యాష్ నింపడానికి ఏజెన్సీ మేనేజర్ నుండి రూ.49 లక్షలు తీసుకుని సిబ్బందితో కలిసి ఏజెన్సీ వాహనంలో బయలుదేరి వెళ్లాడు. వివిధ ఏటీఎం సెంటర్లలో కేవలం రూ.44 లక్షలు మాత్రమే నింపి అంతకుముందు తనతో పనిచేస్తున్న దేవేందర్ అనే వ్యక్తి ఏటీఎంలో నింపిన రూ.47 లక్షల స్లిప్ను తీసుకుని అదే స్లిప్ను ఏజెన్సీకి అందజేశాడు.
తాను కాజేసిన రూ.5 లక్షలలో రూ.3లక్షల 70 వేలు ఇంట్లో దాచిపెట్టి మిగిలిన డబ్బులు తీసుకుని జల్సాలు చేయడానికి గోవా వెళ్లాడు. అక్కడ జల్సాలు చేసుకున్న కృష్ణ ప్రసాద్ తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. అంతకు ముందు రోజునుండే అతని పైన అనుమానం వచ్చిన ఏజెన్సీ మేనేజర్లు… కృష్ణ ప్రసాద్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుండటం, ఇంటికి వెళ్లి వాకబు చేసినా ఇంట్లో కూడా లేకపోవడంతో మేనేజర్లు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న బోయినపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కృష్ణప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను ఇంటిలో దాచిపెట్టిన రూ.3.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు జల్సాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదుచేసి అతని వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
Also Read : Anantapur : ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ కట్..సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో రోగులకు చికిత్స