Tamil Nadu : ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి తల్లి! వేడివేడి నూనెతో..
Tamil Nadu : తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలోని ఓ గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Tamil Nadu : ప్రియురాలిని కలిసేందుకు ఇంటికి వెళ్లిన యువకుడిపై ఆ యువతి తల్లి మరిగే నూనె పోసి దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలోని ఉత్తిరంపట్టు గ్రామానికి చెందిన గోకుల్ కృష్ణన్ (19) కాంచీపురం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల నక్షత్రతో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి గోకుల్ కృష్ణన్ తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ నక్షత్ర తల్లి ధమీమ్ అతడితో తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. తన కుమార్తెతో మాట్లాడటం మానేయాలని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి వివాదం పెద్దదైంది.
మీ కుమార్తెను నేను పెండ్లి చేసుకుంటానని గోకుల్ కృష్ణన్ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ ధమీమ్.. వంట గదిలోకి వెళ్లి మరుగుతున్న నూనె తీసుకొచ్చి యువకుడిపై పోసింది. అతను కేకలు వేయడంతో స్థానికులు వాలాజాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
