నా హత్యకు వాళ్ళు ప్లాన్ చేశారు…బంగ్లాదేశ్ ప్రధాని సంచలన ఆరోపణ

  • Published By: venkaiahnaidu ,Published On : August 21, 2020 / 08:12 PM IST
నా హత్యకు వాళ్ళు ప్లాన్ చేశారు…బంగ్లాదేశ్ ప్రధాని సంచలన ఆరోపణ

Updated On : August 21, 2020 / 8:50 PM IST

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. 2004లో ఢాకాలో గ్రానేడ్ ఎటాక్ ద్వారా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ తనను హత్య చేయాలనుకున్నారని ఆమె చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపుతున్నాయి. హత్యలు చేయడం వాళ్ళకి అలవాటు అని, దేశ స్వాతంత్ర్యంపై వారికి నమ్మకం లేదని షేక్ హసీనా అన్నారు. విముక్తి యుద్ధం స్ఫూర్తిని వారు విశ్వసించడం లేదన్నారు. వారికి అధికారం అంటే, అవినీతికి పాల్పడుతూ డబ్బు సంపాదించే సాధనమని మండిపడ్డారు.

2004 ఆగస్టు 21న బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బంగబంధు ఎవెన్యూలో ఉగ్రవాద వ్యతిరేక సభను అవామీ లీగ్ నిర్వహించింది. ఈ సభ జరుగుతుండగా ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో అప్పటి మొహిలా అవామీ లీగ్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ జిల్లుర్ రహమాన్ సతీమణి ఈవీ సహా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు.

ఈ దారుణ సంఘటనను గుర్తు చేసుకుంటూ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి షేక్ హసీనా మాట్లాడారు. బంగబంధు ఎవెన్యూపై జరిగిన గ్రెనేడ్ దాడిలో తనను హత్య చేయాలని ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ ప్రయత్నించారని చెప్పారు. వాళ్ళ ప్రధాన లక్ష్యం తానేనని తెలిపారు. ఈ దాడి జరగడానికి ముందు ఖలీదా జియా మాట్లాడుతూ, అవామీ లీగ్ వందేళ్ళ వరకు అధికారంలోకి రాదన్నారని చెప్పారు.

అప్పటి బీఎన్‌పీ-జమాత్ ప్రభుత్వం ఉగ్రవాదులను చేరదీసిందన్నారు. ఆ గ్రెనేడ్ దాడిలో తాను మరణించానని ఆ ప్రభుత్వం అనుకుందన్నారు. అయితే తాను మరణించలేదని తెలుసుకుని, ఉగ్రవాదులను దేశం నుంచి పారిపోయేలా చేశారని తెలిపారు.