పాముతో కాటేయించి భార్యను హత్య చేసిన ఘనుడు

అత్తింటి వారినుంచి అదనపు కట్నం కోసం ఆశించిన అల్లుడు అది దక్కకపోయే సరికి తాళి కట్టిన భార్యను పాములతో కాటేయించి హత్య చేసిన ఘటన కేరళలో జరిగింది. కొల్లాం జిల్లాకు చెందిన బ్యాంకు ఉద్యోగి సూరజ్ కి ఉతారా అనే యువతితో రెండేళ్ల కిందట వివాహాం అయ్యింది. ఏడాదిన్నరపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఈ లోపు వారి మధ్య మనస్పర్ధలు రావటం మొదలయ్యాయి.
అదనపు కట్నం కోసం సూరజ్ ఉతారాను వేధించటం మొదలెట్టాడు. ఉతారా తల్లి తండ్రులకు చెప్పినప్పటికీ వారి వద్దనుంచి పైసా కూడా వచ్చే అవకాశం కనిపించక పోవటంతో ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు. భార్యను చంపాలని నిర్ణయించుకున్న సూరజ్… ఎవరికీ దొరక్కూడదని, తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.
తనకు తెలిసిన పాములు పట్టే వ్యక్తి వద్దనుంచి పామును కొనుగోలు చేశాడు. భార్య నిద్ర పోతున్న సమయంలో బెడ్ రూమ్ లోకి పాము వదిలి వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఆ పాము ఉతారాను కాటేసింది. పాము కాటేయడం గమనించిన ఆమె, స్ధానికుల సహాయంతో ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది.
మొదటి ప్రయత్నం విఫలం కావటంతో …ఇది జరిగిన నెల రోజులకు సూరజ్ మళ్లీ సేమ్ ప్లాన్ అమలు చేశాడు. పాములు పట్టేవాడి దగ్గర ఇంకో పామును కొనుగోలు చేసి ఆమె నిద్రిస్తున్న సమయంలో పడకగదిలో వదిలేసి వెళ్లిపోయాడు. రెండోసారి పాము కాటుకు గురైన ఉతారా కన్నుమూసింది. పాము కాటుతో భార్య మరణించిందని ఏడుస్తూ అందరినీ నమ్మించి ఆమె అంత్యక్రియలు పూర్తిచేశాడు.
అప్పటికే అల్లుడు వరకట్నం గురించి వేధిస్తున్నవిషయం తెలిసిన ఉతారా తల్లితండ్రులకు అల్లుడిపై అనుమానం కలిగింది. గది తలుపులు, కిటికీలు మూసి ఉండగా పాము ఆ గదిలోకి ఎలా వెళ్లింది అనే ప్రశ్న వారిని వేధించసాగింది. పైగా ఒకసారి కాదు అతి తక్కువ సమయంలో రెండుసార్లు పాము కాటుకు గురవ్వటంపై అనుమానం పెరిగిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని కేసుపెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. చివరికి భార్యను తానే హత్య చేసినట్లు సూరజ్ ఒప్పుకున్నాడు. రెండు పాములను 10వేల రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పాడు. సూరజ్ తోపాటు అతడికి పాములు విక్రయించిన సురేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
Read: మతి స్ధిమితంలేని మైనర్ చెల్లిపై అత్యాచారం చేసిన సోదరుడు