ముంబైలో బీఎండబ్ల్యూ కారు ప్రమాదం.. ఒకరు మృతి

వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను భాయందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.

ముంబైలో బీఎండబ్ల్యూ కారు ప్రమాదం.. ఒకరు మృతి

Mumbai luxury car hit and run accident near Worli sea link

hit and run accident: ముంబై మహానగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను భాయందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయిన ఉదంతం మరిచిపోకముందే.. తాజాగా జరిగిన ప్రమాదంలో మరొకరు చనిపోయారు. బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో 28 ఏళ్ల వ్యక్తి గాయాలపాలై మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతుడు వినోద్ లాడ్ గా పోలీసులు గుర్తించారు.

జూలై 20న వర్లీ సీ లింక్ సమీపంలోని అబ్దుల్ గఫార్ ఖాన్ రోడ్డులో వేగంగా వస్తున్న కారు వినోద్ లాడ్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ జూలై 27న (శనివారం) అతడు మరణించారు. వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కిరణ్ ఇందుల్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ముంబైలోని వర్లీలో జూలై 7న జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో 45 ఏళ్ల మహిళ మరణించింది. డాక్టర్ అన్నీ బిసెంట్ రోడ్‌లో వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోలివాడ నివాసి కావేరి నఖ్వా (45) దుర్మరణం పాలయ్యారు. మృతురాలి భర్తకు ప్రదీప్ నఖ్వా తీవ్ర గాయాలయ్యాయి. శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన నేత రాజేశ్ షా కొడుకు మిహిర్ షా.. మద్యం మత్తులో ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో.. జూలై 30 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Also Read : బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు.. ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసిన నిందితుడు.. బుల్డోజర్‌తో బార్ కూల్చివేత