హెల్మెట్ పెట్టుకోలేదని… తాళం చెవితో యువకుడి నుదుటిపై పొడిచిన పోలీస్

  • Published By: venkaiahnaidu ,Published On : July 28, 2020 / 07:14 PM IST
హెల్మెట్ పెట్టుకోలేదని… తాళం చెవితో యువకుడి నుదుటిపై పొడిచిన పోలీస్

Updated On : July 28, 2020 / 7:31 PM IST

హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువకుడిపై దాడికి దిగారు పోలీసులు. అతని బైక్ తాళంతోనే అతని నుదుటిపై పొడిచారు. ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

రామ్‌పురా గ్రామానికి చెందిన దీపక్‌.. తన మిత్రుడితో కలిసి బైక్‌పై పెట్రోల్‌ పోయించుకునేందుకు స్థానికంగా ఉన్న పెట్రోల్‌ బంక్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వాహనాన్ని ఆపారు. అయితే వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ పోలీసు వారి బైక్‌ తాళం చెవిని లాక్కొని దీపక్‌ నుదిటిపై బలంగా గుచ్చాడు. దీంతో నుదుటిపై తాళం చెవితోనే గ్రామానికి వెళ్లిన బాధితుడు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు వివరించాడు.

దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు…ఈ దారుణానికి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. మాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఈ సంఘటపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే స్థానికులకు సర్దిచెప్పారు.

పోలీసులపై రాళ్లు రువ్విన అంశంపై సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ ‘రాళ్లు రువ్విన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓ ఎస్సై, ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసినట్లు సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ దిలీప్‌సింగ్‌ కున్వర్‌ తెలిపారు. దీనిపై విచారణకు కూడా ఆదేశించామన్నారు. కాగా,గాయపడ్డ బాధితుడు దీపక్‌ ప్రస్తుతం ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.