పోలీసుల మాస్టర్ ప్లాన్ : ఫేస్బుక్ ఆధారంగా అత్యాచార నిందితుడు అరెస్టు
ఫేస్బుక్ ఆధారంగా ఓ అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన భోపాల్లో చోటు చేసుకుంది.

ఫేస్బుక్ ఆధారంగా ఓ అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన భోపాల్లో చోటు చేసుకుంది.
ఫేస్బుక్ ఆధారంగా ఓ అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన భోపాల్లో చోటు చేసుకుంది. ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం ఏడో తరగతి చదువుతున్న బాలికకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. వీరిద్దరూ కొన్ని రోజుల పాటు చాట్ చేసుకున్నారు. అయితే ఇద్దరం కలుద్దామని బాలికను యువకుడు అడగడంతో ఆమె అంగీకరించింది. బాలిక అతన్ని కలవగానే.. బలవంతంగా కారులో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.
కొద్దిరోజులకు కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం చేసిన వ్యక్తి.. తనకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని బాలిక పోలీసులకు తెలిపింది.
బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిని రామన్ రాజ్పుత్గా పోలీసులు నిర్ధారించారు. అతని ఫేస్బుక్ అకౌంట్ పరిశీలిస్తే సుమారు 350 మంది అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉన్నారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకోవాలని పిప్లానీ పోలీసులు నిర్ణయించుకున్నారు. దీంతో ఎస్ఐ ప్రవీణ్ థాకేరాయ్ ఫేస్బుక్లో అమ్మాయి పేరు మీద నకిలీ అకౌంట్ క్రియేట్ చేశాడు. రాజ్పుత్తో ఒకట్రెండు రోజులు అమ్మాయిలా చాట్ చేశాడు. ఆ తర్వాత భోపాల్లోని ఓ హోటల్లో కలుద్దామని రాజ్పుత్కు చెప్పగా అతను అక్కడికి వచ్చాడు. ఎస్ఐ సివిల్ దుస్తుల్లో ఉండి.. రామన్ అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నారు.