Mumbai History-Sheeter : రియల్ లైఫ్ ‘గజినీ’? ముంబై హిస్టరీ-షీటర్ దారుణహత్య.. శత్రువుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు!
Mumbai History-Sheeter : పోలీసుల కథనం ప్రకారం.. వాఘ్మారేపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. తనకు శత్రువుల నుంచి ప్రాణహాని ఉందనే భయంతో సినిమాల్లో గజినీ మాదిరిగా తన శరీరంపై 22 మంది వ్యక్తుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు.
Mumbai History-Sheeter : అతడో రౌడీ షీటర్.. దోపిడీలు, బెదిరింపులంటూ అతడు చేయని నేరమే లేదు.. ముంబైలో అతడి పేరు వింటేనే హడలిపోతారు. అలాంటి హిస్టరీ షీటర్ ఒక్కసారిగా దారుణహత్యకు గురయ్యాడు. ముంబైలోని వర్లీలోని సాఫ్ట్ టచ్ స్పాలో బుధవారం (జూలై 24)న తెల్లవారుజామున హిస్టరీ షీటర్ గురు వాఘ్మారే (48)ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.
Read Also : Satirical Video: ఒక్క శాతం ఆదాయపన్ను కూడా కట్టకుండా చట్టబద్ధంగా ఎలా తప్పించుకోవచ్చో చెప్పిన యువకుడు
తాను సమాచార హక్కు కార్యకర్తగా చెప్పుకుంటున్నప్పటికీ, వాఘ్మారేపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే, తనకు శత్రువుల నుంచి ప్రాణహాని ఉందనే భయంతో సినిమాల్లో గజినీ మాదిరిగా తన శరీరంపై 22 మంది వ్యక్తుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు. ఆ పేర్లలో స్పా యజమాని సంతోష్ షెరేకర్ కూడా ఉండటంతో పోలీసులు అరెస్టు చేశారు.
ప్లాన్ ప్రకారమే.. వాఘ్మారే హత్యకు కుట్ర :
పోలీసుల కథనం ప్రకారం.. వాఘ్మారే దోపిడీ బెదిరింపులతో విసిగిపోయిన షేరేకర్ వాఘ్మారే హత్యకు “సుపారీ” ఇచ్చాడు. హిస్టరీ షీటర్ గురును హత్య చేసేందుకు మహ్మద్ ఫిరోజ్ అన్సారీ(26)కి షేరేకర్ రూ.6 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరికీ ఇంతకుముందే సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే.. అన్సారీకి స్పా ఉందని వాగ్మారే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దాడి తర్వాత ఆ కేసు క్లోజ్ చేశారు.
వాఘ్మారే అలాంటి ఫిర్యాదులను దాఖలు చేయకుండా, స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేయకుండా ఆపాలని కోరుతూ షెరేకర్ను అన్సారీ సంప్రదించాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. వాగ్మారేను హత్యచేయాల్సింవదిగా షెరేకర్ అన్సారీకి సూచించారని ఆరోపించారు. మూడు నెలల క్రితమే ఢిల్లీ నివాసి సాకిబ్ అన్సారీని ఫిరోజ్ అన్సారీ సంప్రదించి ఈ కుట్ర పన్నారు. వాఘ్మారే కదలికలను గమనించిన తర్వాత ఇద్దరూ షెరేకర్ స్పాలో అతన్ని చంపాలని ప్లాన్ చేశారు.
సీసీటీవీ ఫుటేజీలో రికార్డు :
గత మంగళవారం సాయంత్రం వాఘ్మారే తన స్నేహితురాలితో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాడు. రెయిన్కోట్లు ధరించి ఇద్దరు దుండగులు అతడిని వెంబడించడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. దుండగుల్లో ఒకరు ఫిరోజ్ అన్సారీకి సంబంధించిన యూపీఐ ద్వారా చెల్లించి సమీపంలోని దుకాణం నుంచి గుట్కా కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు కనుగొన్నారు. ఫిరోజ్, సాకిబ్ అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించాడు. వాఘ్మారే స్నేహితురాలిని మరో గదికి తీసుకెళ్లి బ్లేడ్లతో అతన్ని హత్య చేశారు. ఒక బ్లేడు అతని గొంతు కోసేందుకు, మరొకటి కడుపులో పొడిచేందుకు ఉపయోగించారు.
వాఘ్మారే స్నేహితురాలు తనకు హత్య గురించి ఉదయం 9:30 గంటలకు తెలిసిందని, పోలీసులను సంప్రదించడానికి 2 గంటల సమయం పట్టినా షేరేకర్కు సమాచారం అందించారని పేర్కొంది. షేరేకర్ను విచారించేందుకు పోలీసులు అరెస్టు చేశారు. క్రైం బ్రాంచ్ బృందం తదనంతరం ఫిరోజ్ అన్సారీని నల్లసోపారా నుంచి అరెస్టు చేయగా, సాకిబ్ అన్సారీని న్యూఢిల్లీకి వెళ్లే మార్గంలో రాజస్థాన్లోని కోటాలో పట్టుకున్నారు. ఇద్దరు అదనపు నిందితులను కూడా అరెస్టు చేశారు.
ఈ హత్యకేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. వాఘ్మారే ప్రియురాలి ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాగ్మారేపై 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్లోని స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసిన చరిత్ర ఉంది. అతనిపై అనేక దోపిడీ, అత్యాచారం, వేధింపుల కేసులు ఉన్నాయి. అతనిపై ఎనిమిది కాగ్నిసబుల్ నేరాలు, 22 నాన్ కాగ్నిసబుల్ కేసులు నమోదయ్యాయి.